
ముంబై: బౌలింగ్లో అదనంగా 15 పరుగులు ఇవ్వడం, బ్యాటింగ్లో సరైన ఆరంభం అందుకోకపోవడంతోనే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా తెలిపాడు. పంజాబ్తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 11 పరుగులతో తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రవీంద్ర జడేజా.. టీమ్ ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యామని చెప్పాడు. అంబటి రాయుడు అద్భుతంగా బ్యాటింగ్ చేసినా లక్ష్యాన్ని చేధించలేకపోయామని తెలిపాడు.
'ఈ మ్యాచ్ను మేం అద్భుతంగా ప్రారంభించాం. అయితే చివర్లో కట్టడి చేయలేక 10 నుంచి 15 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. మా టీమ్ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయలేకపోయాం. అంబటి రాయుడు మాత్రం అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. అయితే పంజాబ్ను 175 పరుగుల లోపు పరిమితం చేసుంటే.. ఫలితం మరోలా ఉండేది. మొదటి 6 ఓవర్లలో సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. ఇదే మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్కు బలంగా తిరిగొస్తాం'అని తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. భానుక రాజపక్స(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42) రాణించాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు(39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 78) పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా, రిషి ధావన్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ,అర్షదీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చాన్స్ సన్నగిల్లాయి.