
నిద్రనే వచ్చేది కాదు..
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న జడేజా.. తాజాగా ఓ నేషనల్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిక్తర విషయాలు పంచుకున్నాడు. '2018కి ముందు ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఆ సమయంలో రోజూ తెల్లవారుజాము దాదాపు 5 గంటల వరకు మెలకువతోనే ఉండేవాడిని. ఏం చేయాలి. మళ్లీ ఎలా పుంజుకోవాలనే విషయాలపైనే ఆలోచించేవాడిని. దాంతో నిద్ర పట్టేది కాదు. అప్పుడు టెస్టు జట్టులో కొనసాగుతున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కేది కాదు.

చాన్స్ వచ్చేది కాదు..
వన్డేల్లో చోటు కోల్పోయా. టీమిండియాతో కొనసాగడం వల్ల దేశవాళీ క్రికెట్లోనూ ఆడలేకపోయా. నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చేదికాదు. ఎలా ముందుకు సాగాలో అనేదానిపై తీవ్రంగా ఆలోచించేవాడిని. కానీ, 2018లో ఆడిన ఓవల్ టెస్టే మొత్తం మార్చేసింది. అది నా ఆటను, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత హార్దిక్ పాండ్య గాయపడటంతో నేను వన్డేల్లోకి తిరిగి వచ్చా. నాటి నుంచి నేను బాగా ఆడుతున్నా' అని జడేజా చెప్పుకొచ్చాడు.

2019 ప్రపంచకప్లోనూ..
కాగా, ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 332 పరుగులు చేయగా, టీమిండియా 160కే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అదే సమయంలో జడేజా( 156 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 86 నాటౌట్) ఎనిమిదో ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును ఆదుకున్నాడు.
హనుమ విహారి( 124 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56)తో కలిసి ఏడో వికెట్కు 77 పరుగులు జోడించాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోరును 292 పరుగులకు చేరవేశాడు. ఈ ఇన్నింగ్స్తోనే జడ్డూ తర్వాతి కాలంలో కీలక ఆటగాడిగా మారాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్లోనూ జడేజా(77).. ధోనీ(50)తో కలిసి మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓటమిపాలైనా అతడి పేరు మాత్రం మార్మోగిపోయింది.


Click it and Unblock the Notifications
