
డిక్లెర్ ఇవ్వమని నేనే చెప్పాను..
రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన రవీంద్ర జడేజా.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడాన్ని తప్పుబడుతూ టీమ్మేనేజ్మెంట్పై వస్తున్న విమర్శలపై స్పందించాడు. వాస్తవానికి రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేయాలని సందేశం పంపాడని, కానీ తానే అంగీకరించలేదన్నాడు. 'కెప్టెన్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ పూర్తయ్యాకే డిక్లేర్ ఇస్తామని కుల్దీప్ యాదవ్తో సందేశం పంపించాడు. కానీ దాన్ని నేను వ్యతిరేకించాను. చివరి సెషన్లో ఫీల్డింగ్ చేసి అలసిపోయిన శ్రీలంక ఆటగాళ్లను బ్యాటింగ్కు ఆహ్వానిస్తే త్వరగా వికెట్లు తీయవచ్చని భావించాను.

వికెట్లు తీయాలనే..
పైగా బంతి టర్న్ అవ్వడం గమనించాను. అనూహ్య బౌన్స్ కూడా అవుతుంది. పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా మారుతుంది. వారిని బ్యాటింగ్కు ఆహ్వానిద్దామని చెప్పాను. రెండు రోజులుగా ఫీల్డింగ్ చేసిన శ్రీలంక ఆటగాళ్లకు బ్యాటింగ్లో భారీ షాట్లు ఆడటం, ఎక్కువ సేపు క్రీజులో నిలబడటం అంత సులువు కాదు. కాబట్టి వీలైనంత వేగంగా ఆడి డిక్లేర్ ఇవ్వాలని ప్లాన్ వేసుకున్నాం. ఆ క్రమంలోనే డిక్లేర్ ఇవ్వాలని నేనే చెప్పాను'అని జడేజా స్ఫష్టం చేశాడు.

భారత్ దే ఆదిపత్యం..
రవీంద్ర జడేజా భారీ శతకంతో ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించింది. అతని అజేయ శతకానికి తోడు రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. భారత్ కన్నా ఆ జట్టు ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. సెంచరీ హీరో జడేజా, జస్ప్రీత్ బుమ్రా చెరొక వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications
