న్యూఢిల్లీ: వన్డేప్రపంచకప్ 2023లో టీమిండియా విజేతగా నిలస్తుందని, అభిమానుల ప్రేమనే గెలిపిస్తోందని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. వ్యక్తిగతంగా ఈ ప్రపంచకప్ తనకు ప్రత్యేకమని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జడేజా మూడు వికెట్లతో సత్తా చాటాడు. మెగా టోర్నీ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ పోడ్కాస్ట్తో మాట్లాడిన జడేజా... వన్డే ప్రపంచకప్ను టీమిండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

'ఈ ప్రపంచకప్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే సొంతగడ్డపై నేను ఆడుతున్న తొలి ప్రపంచకప్ ఇదే. అభిమానులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మా జట్టు సమతూకంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఎలాంటి బలహీనతలు లేవు.
అభిమానుల ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, మాపై వారికి ఉన్న నమ్మకం చాలా ఎక్కువ. భారత్లో మేం ఎక్కడ ఆడినా.. ఏ సిరీస్ బరిలోకి దిగినా.. స్టేడియం కిక్కిరిసిపోయేలా.. వేల సంఖ్యలో హాజరై మాకు మద్దతు తెలుపుతారు. అలాంటి అభిమానుల మధ్య ప్రపంచకప్ ఆడటం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ టోర్నీలో మేం అద్బుత ప్రదర్శన కనబర్చి ఫైనల్ చేరడంతో పాటు టైటిల్ గెలుస్తామని ఆశిస్తున్నా. అభిమానుల ప్రేమే మేం అద్భుత ప్రదర్శన చేసేలా చేస్తోంది.'అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్లకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 97 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టాడు.