చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ హవా నడుస్తోంది. కెరీర్లో ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ ఆటగాడి ఆటను చివరిసారి చూసేందుకు ప్రేక్షకులు మైదానాలకు ఎగబడుతున్నారు. తమ అభిమాన జట్లకు కాకుండా ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్కు మద్దతు తెలుపుతున్నారు.
చెన్నైలోనే కాకుండా ఎక్కడ ఆడినా.. మైదానాలన్నీ పసుపుమయం అవుతున్నాయి. ఇక ధోనీ బ్యాటింగ్కు వస్తే అభిమానులు ఆనందానికి హద్దే లేకుండా పోతుంది. వ్యూయర్ షిప్లో రికార్డులు బద్దలవుతున్నాయి. అటు ధోనీ కూడా అభిమానులను తనదైన ఫినిషింగ్ స్కిల్స్తో అలరిస్తున్నాడు. ఆడిన నాలుగు, ఐదు బంతుల్లోనే భారీ సిక్సర్లు బాది జట్టుకు కావాల్సిన పరుగులు అందించడంతో పాటు ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు.

ఇక ధోనీ బ్యాటింగ్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ బ్యాటింగ్ కోసం అభిమానులు తాను త్వరగా ఔటవ్వాలని కోరుకుంటున్నారని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై 27 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన జడేజా( 21(16), 1/19)కు మ్యాన్ ఆఫ్ ది అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకునే క్రమంలో జడేజా.. తన మాటలతో నవ్వులు పూయించాడు. ముందు బ్యాటింగ్ చేసినా.. చివర్లో ఆడినా అభిమానులు తాను ఔటవ్వాలని కోరుకుంటున్నారని తెలిపాడు.
'ఓ స్పిన్నర్గా బంతి టర్న్ అవుతుందన్నా.. ఆగి వస్తుందన్నా సంతోషంగా ఉంటుంది. మేం ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేశాం. ఏ లెంగ్త్లో ఎంత వేగంతో బంతిని వేయాలనే విషయాన్ని గ్రహించాం. ఆతిథ్య జట్టుకు ఇది తెలుసుకునేందుకు సమయం పడుతుంది. హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ను మేం వాడుకున్నాం. ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడారు. సమష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం.
ధోనీ కోసం నేను త్వరగా ఔటవ్వాలని కోరుకుంటున్నారు. ధోనీ ధోనీ అనే నినాదాలతో నా చెవులు గిల్లుమంటున్నాయి. అప్ది ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తే నేను ఎప్పుడు ఔటవుతానా? అని ఎదురుచూస్తున్నారు. ఏడో స్థానంలో ఆడినా నిరుత్సాహపడుతున్నారు. 'అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.