రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత జట్టులో తన బాధ్యత పెరిగిందని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. అశ్విన్ జట్టులో లేకపోవడంతో తాను మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తున్నానని తెలిపాడు. బ్యాటర్గా కూడా తన పాత్ర మారిందని చెప్పాడు. న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో 8 వికెట్లతో పాటు ఓ సెంచరీ చేసిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా మాట్లాడిన జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత నాకు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించింది. జట్టుగా మేం బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాం. గత 5, 6 నెలలుగా మేం ఎలాంటి క్రికెట్ ఆడుతున్నామో మాకు తెలుసు. అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేయడం జట్టుకు ఒక మంచి సంకేతం. గౌతమ్ గంభీర్ సూచనలతో నేను ఇప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాను. దాంతో సరైన బ్యాటర్గా ఆలోచిస్తున్నాను. గతంలో నేను 8, 9వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని. అప్పుడు బ్యాటర్గా నా మానసిక స్థితి భిన్నంగా ఉండేది.

బ్యాటింగ్ చేసే అవకాశం దొరికినప్పుడల్లా క్రీజులో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే నేను రికార్డులను అస్సలు పట్టించుకోను. నా జట్టును గెలిపించడానికి బ్యాట్, బంతితో సత్తా చాటడంపై మాత్రమే ఫోకస్ పెడుతాను. నేను ఎల్లప్పుడూ ఆల్రౌండర్గా రాణించాలనుకుంటాను. బ్యాట్, బంతితో రాణించకపోతే నా విలువను ప్రతిబించించదని నేను భావిస్తాను. జట్టు కోసం నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. నా 100 శాతం ఇస్తాను. ఇది నా మూడో మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'అని జడేజా చెప్పుకొచ్చాడు.
121 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 63/1 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 35.2 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్కు 270 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆలౌటైంది.