అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా ఘన విజయం సాధించింది. జామ్నగర్ నార్త్ నియోజిక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రివాబా జడేజా... తన ప్రత్యర్థి కంటే 15 వేలకు పైగా ఓట్లు సాధించి.. భారీ మెజారిటీతో ఘన విజయాన్నందుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు గాయంతో జట్టుకు దూరమైన జడేజా.. దగ్గరుండి సతీమణి రివాబాను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాడు. సతీమణి తరఫున జోరుగా ప్రచారం చేసిన జడేజా.. తన చరిష్మాతో ఓటర్లు ఆకట్టుకున్నాడు. సతీమణి ఎన్నికల ప్రచారం కోసమే బంగ్లాదేశ్ పర్యటనకు జడేజా దూరంగా ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జడేజా.. 57 శాతానికి పైగా ఓట్లు సాధించింది. జామ్నగర్ నార్త్ నియోజక వర్గం నుంచే పోటీచేసిన ఆమ్ ఆద్మీ అభ్యర్థి కర్షన్భాయ్ కర్ముర్ 23 శాతం ఓట్లు దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిపేంద్రసిన్హ్ జడేజాకి 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జడేజా సోదరి నైనబా జడేజా, తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా కోడలికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బిపేంద్ర సిన్హ్ జడేజాను గెలిపించాలని కోరారు. కానీ మామ, ఆడబిడ్డపై రివాబా జడేజానే పై చేయి సాదించింది. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నారు. జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి జడేజా సోదరి నైనబా జడేజా టికెట్ ఆశించింది. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు.
ఇక 1990లో జన్మంచిన రివాబా జడేజా.. మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా.. కాంగ్రెస్కు చెందిన హరి సింగ్ సోలంకి మేనకోడలు. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లిచేసుకున్న రివాబా జడేజా.. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల అఫిడవిట్లో ఆమె ఆస్తుల విలువ రూ.97 కోట్లుగా పేర్కొన్నారు.
గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా జట్టుకి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ నుంచి దూరంగా ఉన్నాడు. ఎన్నికలు ముగియడంతో టెస్ట్ సిరీస్కు అయిన జడేజా అందుబాటులోకి వస్తాడో లేక.. సతీమణి జైత్రయాత్రల కోసం దూరంగా ఉంటాడోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.