
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి అతని సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జడేజాకు క్రికెటే మొదటి ప్రాధాన్యతని తెలిపారు. తకంటే కూడా క్రికెటే ఎక్కువని స్పష్టం చేశారు. గాయం నుంచి కోలుకొని జడేజా సత్తా చాటడంపై రివాబా సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్తో జడేజా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తొలి టెస్ట్లో ఆసీస్ పతనాన్ని శాసించిన జడేజా.. ఢిల్లీ టెస్ట్లో(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. రెండు టెస్ట్ల్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిసి 17 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో మూడు ఇన్నింగ్స్ల్లో 96 పరుగులు చేశాడు. తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీ బాది విజయానికి బాటలు వేసాడు.
తాజాగా జడేజా సూపర్ రీఎంట్రీ గురించి మాట్లాడిన రివాబా.. క్రికెట్తో అతనికి ఎంతో అనుబంధం ఉందని తెలిపింది. 'జడేజా ఎంతో సానుకూల దృక్పథంతో మైదానంలోకి అడుగుపెడుతాడు. అది అతనికి అతిపెద్ద బలం. క్రికెట్ అతని మొదటి ప్రాధాన్యత. క్రికెట్తో అతనికి ఎంతో అనుబంధం ఉంది. రీఎంట్రీ కోసం జడేజా తీవ్రంగా కష్టపడ్డాడు. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకున్న జడేజాకు బీసీసీఐ కోచ్లు, ఫిజియోథెరపిస్ట్లు ఎంతో సహకరించారు.
ఇప్పటికే అతను అంతర్జాతీయ క్రికెట్లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అతని బలం ఏంటో జడేజాకు తెలుసు. జట్టు కోసం జడేజా పడుతున్న కష్టానికి, దక్కుతున్న ఫలితానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. గాయం అనంతరం రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటడం ఆనందంగా ఉంది. జడేజా చాలా తక్కువగా మాట్లాడుతాడు. కానీ తన ఆటతో అందరూ తన గురించి మాట్లాడేలా చేస్తాడు. అతనికి సానుకూల కామెంట్స్తో పాటు విమర్శలు కూడా వస్తాయి. వీటి గురించి మాట్లాడటం కంటే తన బలహీనతలను అధిగమించడంపై జడేజా పోకస్ పెడతాడు 'అని రివాబా జడేజా చెప్పుకొచ్చింది.