
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా సరికొత్తగా సిద్దమవుతోంది. ఈ మెగా ఫైనల్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీ లుక్ను పోలీ ఉంది. ఈ జెర్సీపై బీసీసీఐ లోగోతో పాటు కేవలం 'ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021', ఇండియా అని మాత్రమే రాసుండగా.. మరే స్పాన్సర్ పేరు లేదు. ఐసీసీ ఈవెంట్ కావడంతో స్పాన్సర్లు లేరని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'రివైండ్ టు 1990'అని క్యాప్షన్గా రాసుకొచ్చాడు.
ఇక ఈ నయా జెర్సీపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. స్పాన్సర్లు లేరా?.. షాకింగ్గా ఉందని ఒకరంటే.. స్పాన్సర్ల లేకుంటే చూడ ముచ్చటగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. స్వెటర్ను పోలీ ఉన్న ఈ జెర్సీపై కొంతమంది వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఇంగ్లండ్లో చలి ఎక్కువగా ఉంటుందని, జెర్సీ ఇలా రూపొందించారని కామెంట్ చేస్తున్నారు.
జూన్ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఫైనల్కు సంబంధించిన రూల్స్ను ఐసీసీ ప్రకటించింది.
ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వుడేను కేటాయిస్తారు. జూన్ 23 రిజర్వు డేగా ఉంటుంది. అదీ ఐదు రోజుల్లో ఫలితం తేలకుంటేనే.. సాధారణ రోజుల్లో నష్టపోయే సమయాన్ని మాత్రమే రిజర్వ్డే ఆడిస్తారు. ఐదు రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో ఆట జరిగితే రిజర్వ్ డే ఉండదు. ఫలితంతో దీనికి సంబంధం లేదు. ఫలితం తేలని పక్షంలో రిజర్వ్ డేతో సంబంధం లేకుండా డ్రాగా ప్రకటిస్తారు.
రిజర్వ్ డే ఉపయోగించుకోవాలా లేదా అన్నది మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తారు. అది కూడా ఐదో రోజు చివరి గంటలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు. మ్యాచ్లో పూర్తిగా గ్రేడ్ 1 డ్యూక్ బంతుల్ని వినియోగిస్తారు. షార్ట్రన్పై మూడో అంపైర్ నిర్ణయం తీసుకుంటాడు. మిగతా ఎల్బీడబ్ల్యూ, డీఆర్ఎస్ నిబంధనలు ఎప్పటిలాగే ఉంటాయి.