
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న జడేజా తడబడ్డాడు. కెప్టెన్సీ అనుభవం లేక తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా వ్యక్తిగతంగా కూడా విఫలమయ్యాడు. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు చివరకు ఫీల్డింగ్లోనూ రాణించలేకపోయాడు. దాంతో సారథ్య బాధ్యతలను మళ్లీ ధోనీకే అప్పగించేసాడు. ఆ తర్వాత గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
అయితే ఉద్దేశపూర్వకంగా జడేజాను తప్పించారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోనీతో పాటు టీమ్మేనేజ్మెంట్తో వచ్చిన విబేధాలో జడేజాను జట్టుకు దూరం చేసాయనేది ఆ వార్తల సారంశం. జడేజా సైతం టీమ్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఈ వార్తలను ఖండించాడు. ఇవన్నీ గాలి వార్తలని స్పష్టం చేశాడు. జడేజా వచ్చే సీజన్లో కూడా సీఎస్కేకు ఆడుతాడని చెప్పాడు. దాంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది.
అయితే ఇంగ్లండ్తో రీషెడ్యూల్ టెస్ట్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన జడేజా సెంచరీతో సత్తా చాటాడు. శనివారం ఇంగ్లండ్తో జరగనున్న రెండో టీ20తో మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సీఎస్కేకు సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్మారింది. సీఎస్కేతో తెగదెంపులు చేసుకున్నాడు కాబట్టే ఆ జట్టుకు సంబంధించిన పోస్ట్లు తొలిగించాడనే వాదన తెరపైకి వచ్చింది. దాంతో వచ్చే సీజన్లో జడేజా సీఎస్కేకు ఆడటం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు వైస్ కెప్టెన్గా జడేజా ఎంపికైన విషయం తెలిసిందే.