టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్ అని కొనియాడాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో రవీంద్ర జడేజా 10 ఇన్నింగ్స్ల్లో 86 సగటుతో 516 పరుగులతో రాణించాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం ఉంది. మరోవైపు శుభ్మన్ గిల్ 754 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్గా చరిత్రకెక్కాడు. దాంతో ఈ సిరీస్ 2-2తో సమమైంది.
తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన అజయ్ జడేజా.. శుభ్మన్ గిల్ కంటే రవీంద్ర జడేజా మెరుగ్గా, నిలకడగా రాణించాడని కొనియాడాడు. ' రవీంద్ర జడేజా గురించి ఏం చెప్పాలి? అతను ఏం చేయగలడో అది చేశాడు. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. శుభ్మన్ గిల్ 754 పరుగులు చేశాడు. అతను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడని అందరూ కొనియాడుతున్నారు.

జడేజా 500 ప్లస్ రన్స్ చేశాడు. కానీ శుభ్మన్ గిల్ కంటే నిలకడగా రాణించాడు. అతను నాలుగు ఇన్నింగ్స్ల్లో ఔట్ అవ్వలేదు. మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. కేవలం రెండు ఇన్నింగ్స్ల్లో మాత్రమే త్వరగా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా ప్రదర్శనతోనే టీమిండియా ఈ సిరీస్ను సమం చేసుకుంది. లార్డ్స్ టెస్ట్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆఖరి టెస్ట్లో మెరుగ్గా ఆడాడు.'అని అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు.