న్యూఢిల్లీ: భారత క్రికెటర్లలో అందరికంటే ఎక్కువగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు డోప్ పరీక్షలు నిర్వహించారు. గత ఐదు నెలల కాలంలో అతని నుంచి మూడు సార్లు శాంపిల్స్ను సేకరించినట్లు నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) ప్రకటించింది. నాడా గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 55 మంది క్రికెటర్ల నుంచి 58 శాంపిళ్లు సేకరించారు.
ఈ మొత్తం శాంపిళ్లలో సగం కంటే ఎక్కువ మ్యాచ్ లేని సమయంలోనే సేకరించినవి కావడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. 2021 (54), 2022 (60)తో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ శాంపిళ్లు సేకరించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల శాంపిళ్లు ఒక్కసారి కూడా తీసుకోలేదు. గత రెండేళ్లలోనూ కోహ్లీని ఒక్కసారీ కూడా పరీక్షించలేదు. అదే రోహిత్ శర్మ నుంచి మాత్రం మూడు సార్లు శాంపిళ్లను తీసుకున్నారు. ఈ ఏడాది హార్దిక్ పాండ్యా నుంచి ఒకసారి శాంపిల్ సేకరించారు.
ఈ జాబితాలో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు కూడా ఉన్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శాంపిళ్లను ఒక్కోసారి నాడా పరీక్షించింది. ఐపీఎల్ సందర్భంగానే దాదాపు 20 శాంపిళ్లు తీసుకున్నట్లు నాడా పేర్కొంది. ఈ 58లో ఏడు మాత్రమే రక్త నమూనాలు కాగా మిగతావి మూత్రం శాంపిళ్లు.
సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అంబటి రాయుడు తదితరులనూ నాడా పరీక్షించింది. డేవిడ్ మిల్లర్, కామెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ లాంటి విదేశీ క్రికెటర్ల శాంపిళ్లనూ కూడా నాడా సేకరించింది.
ఇతర క్రీడాకారులు మీరాబాయి (వెయిట్లిఫ్టింగ్), లవ్లీనా (బాక్సింగ్), సైనా, శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), బజ్రంగ్, వినేశ్ (బాక్సింగ్), హర్మన్ప్రీత్, శ్రీజేష్, సవిత (హాకీ) శాంపిళ్లనూ తీసుకుంది. ఓవరాల్గా 1500కు పైగా శాంపిళ్లను సేకరించింది. ఇందులో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి దాదాపు 500 శాంపిళ్లు ఉన్నాయి.