సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. బ్యాటింగ్లో తడబడినా బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో టీమిండియా పైచేయి సాధించింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(29 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బవుమాతో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/29) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు 37/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) పర్వలేదనిపించారు.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో ఈ ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు ఆటలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. ఫస్ట్ సెషన్లో సౌతాఫ్రికా చివరి మూడు వికెట్లు తీస్తే.. భారత్ ముందు 100 పరుగుల లోపే లక్ష్యం నమోదు అవుతుంది. ఆ తర్వాత భారత్ ఆచితూచి ఆడితే విజయం లాంఛనమవుతుంది. అయితే నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. భారత్ కూడా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సఫారీ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడాలి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది.