మైదానంలో చురుకుగా ఫీల్డింగ్ చేయడం వల్లనే తాను వరుసగా గాయాపడుతున్నానని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ టెస్ట్లో తొడ కండరాల గాయానికి గురైన జడేజా.. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ ఆడలేదు. ఎన్సీఏలో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని మూడో టెస్ట్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందా..? మరో మ్యాచ్ వరకు టీమిండియా మేనేజ్మెంట్ వేచి చూస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను తరుచు గాయపడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. మైదానంలో హాట్స్పాట్లో ఫీల్డింగ్ చేయడమే తన వరుస గాయాలకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డాడు.

'వరుసగా గాయాల బారిన పడటం చికాకుకు గురిచేస్తోంది. కానీ ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచ్లు పెరగడంతో గాయాలు కావడం సాధారణమైంది. మైదానంలో నేను దాక్కోను. నేను ఎప్పుడూ ఏ ఫార్మాట్లోనైనా హాట్స్పాట్లో ఫీల్డింగ్ చేస్తాను. నా వరుస గాయాలకు ఇదే కారణం కావచ్చు. బంతి తరుచూ నా దగ్గరికి వస్తూ ఉంటోంది.
నేను అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తానని, సూపర్ క్యాచ్ అందుకుంటాననే అంచనా జట్టుకు ఉంది. అలా ఉండటం మంచిదే. ఇక గాయాల బారిన పడకుండా నేను తెలివిగా ఫీల్డింగ్ చేయగలను. జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మళ్లీ గాయాల బారిన పడననే గ్యారింటీ అయితే లేదు.
జట్టు కోసం నేను 100 శాతం నా ఎఫర్ట్ పెడుతాను. నా శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. డైవింగ్ అవసరం లేని చోట చేయను. ఈ విషయంపై నేను పెద్దగా ఆలోచించడం లేదు. ఎందుకంటే గాయం నుంచి కోలుకొనే వస్తున్నాను. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాను. మ్యాచ్ జరగుతున్నప్పుడు శరీరం అటోమెటిక్గా ఆ ఫ్లోను అందుకుంటుంది. గాయమైందనే ఆలోచన మదిలో నుంచి పోతుంది. ఒకటి రెండు రోజుల్లోనే నేను రిథమ్ అందుకుంటాను.'అని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.