దుబాయ్: ఈ ఏడాది జరుగుతుందో లేదో అనుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్కు అంతా సిద్దమైంది. కరోనా కారణంగా భారత్ను వదిలి యూఏఈకి తరలి వెళ్లిన ఈ క్యాష్ రిచ్ లీగ్కు మరి కొద్ది గంటల్లోనే తెరలేవనుంది. ఫస్ట్ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అబుదాబి వేదికగా తలపడుతున్నాయి.
అయితే ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన జడేజా వరుసగా 12 సీజన్లు ఆడాడు. 2012లో సీఎస్కే జట్టుతో జతకట్టాడు. ఆ ఏడాది జరిగిన వేలంలో జడేజాను చెన్నై రూ.9.72 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సీఎస్కే ఆడుతున్న జడేజా.. ఇప్పటి వరకు 170 ఐపీఎల్ మ్యాచ్ల్లో 1, 927 పరుగులతో పాటు 108 వికెట్లు పడగొట్టాడు.
తాజా ఐపీఎల్ సీజన్లో జడేజా మరో 73 పరుగులు చేస్తే.. టోర్నీ చరిత్రలోనే 2,000 పరుగులు, 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఆల్రౌండర్గా సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకోనున్నాడు. జడేజా తర్వాతి స్థానంలో సీఎస్కేకు చెందిన షేన్ వాట్సన్ 3,575 పరుగులు, 92 వికెట్లతో ఉండగా.. ఐపీఎల్ 2019 సీజన్లో కనీసం ఒక్క ఓవర్ కూడా వాట్సన్ బౌలింగ్ చేయలేదు.
ఇక మూడో స్థానంలోనూ చెన్నైకి చెందిన ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో 1,483 పరుగులు, 147 వికెట్లతో ఉండటం గమనార్హం. వాట్సన్ మరో 8 వికెట్లు తీస్తే ఈ ఘనతను అందుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతను బౌలింగ్ చేసే దాఖలాలు లేవు. పూర్తిగా బ్యాటింగ్పైనే ఫోకస్ పెట్టాడు. మరీ జడేజా ఈ అరుదైన ఘనతను అందుకునేందుకు ఎన్ని మ్యాచ్లు తీసుకుంటాడో చూడాలి!
ఆర్సీబీకి హిందీ సెగ.. ఫ్రాంచైజీపై మండిపడుతున్న కన్నడ ప్రజలు!