ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరం తాను అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వచ్చిన వార్తలపై టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఘాటుగా స్పందించాడు. హగ్ చేసుకుంటే రిటైర్మెంట్ అని రాసేస్తారా? అని ప్రశ్నించాడు. పుకార్లు పుట్టించవద్దని, తనకు రిటైర్మెంట్ ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా సమష్టిగా రాణించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది.
భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వయసు 35 ధాటింది. టీ20 ప్రపచకప్ 2024 విజయానంతరం ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకేసారి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లోనే కొనసాగుతున్నారు. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది.

ఈ ప్రచారానికి తగ్గట్లుగానే ఫైనల్లో రవీంద్ర జడేజా వ్యవహరించాడు. తన బౌలింగ్ స్పెల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. దాంతో జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను జడేజా ఖండించాడు. గతంలో కూడా కోహ్లీని హగ్ చేసుకున్నానని, రిటైర్మెంట్ పుకార్లు పుట్టించవద్దని కోరాడు. ఇంకొన్నాళ్లు ఆడుతానని తెలిపాడు.
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సైతం రిటైర్మెంట్ వార్తలకు తెరదించాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఉద్దేశం తనకు లేదని రోహిత్ శర్మ తెలిపాడు. భారత జట్టు మంచి స్థానంలో ఉన్నప్పుడే తాను వీడ్కోలు పలుకుతానని విరాట్ కోహ్లీ చెప్పాడు. దాంతో వన్డే ప్రపంచకప్ 2027 వరకు ఈ సీనియర్ ఆటగాళ్లు కొనసాగే అవకాశం ఉంది.