
నాటింగ్హామ్: టీమిండియా ఆల్రౌండర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన ఐదో భారత ఆల్రౌండర్గా రికార్డుకెక్కాడు. ఇంగ్లండ్తో నాటింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో హాఫ్ సెంచరీ బాదిన రవీంద్ర జడేజా(86 బంతుల్లో 8 ఫోర్లతో 56) టెస్ట్ కెరీర్లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దాంతో దిగ్గజ ఆల్రౌండర్ల జాబితాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
టెస్టు క్రికెట్లో 2000 పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ 5,248 పరుగులు, 434 వికెట్లతో టాప్లో అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్(2685 రన్స్, 413 వికెట్లు), అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఉన్నారు. తాజాగా వీరి సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు. ఓవరాల్గా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఐదో ఆల్రౌండర్గానూ రవీంద్ర జడేజా నిలిచాడు. మొదటి స్థానంలో ఇయాన్ బోథమ్ ఉండగా.. ఆ తర్వాత కపిల్దేవ్, ఇమ్రాన్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ టాప్-4లో ఉన్నారు. జడేజా 53 టెస్టుల్లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు.
125/4 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 84.5 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(214 బంతుల్లో 12 ఫోర్లతో 84), రవీంద్ర జడేజా రాణించారు. ఆరో వికెట్కు ఈ ఇద్దరు 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. దాంతో భారత్కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/85) ఐదు వికెట్లతో చెలరేగగా.. జేమ్స్ అండర్సన్(4/54) నాలుగు వికెట్లతో రాణించాడు. రిషభ్ పంత్(20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 25) తీవ్రంగా నిరాశపరిచాడు. రాహుల్కు జత కలిసిన జడేజా తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. రాహుల్ ఔటైనా తన జోరును తగ్గించలేదు. ఈ క్రమంలో 81 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే తన ట్రేడ్ మార్క్ స్టైల్లో కత్తిసాములా బ్యాట్ను తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.