న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆ జట్టు మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా గుడ్బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ వాదన తెరపైకి రాగా.. అలాంటిదేం లేదని సీఎస్కే క్లారిటీ ఇచ్చింది. అయితే సీఎస్కే ఎన్ని చెబుతున్నా జడేజా జట్టును వీడటం ఖాయమని, అతి త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని టైమ్స్ ఇండియా పేర్కొంది. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసినప్పటి నుంచి జడేజా చెన్నై టీమ్తో టచ్లో లేడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
మాములుగా చెన్నై జట్టు ఐపీఎల్ ముగిసిన తమ ఆటగాళ్లతో తరుచూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అయితే ఎన్ని యాక్టివిటీస్ చేసినా.. అందులో జడేజా పాల్గొనలేదు. అంతేకాకుండా జడేజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి సీఎస్కే ఫొటోలు డిలీట్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.
ఐపీఎల్ 2022 సీజన్లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకు జడేజా దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్గానే కాదు.. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ చెత్త ప్రదర్శన కనబర్చాడు.
తీవ్ర ఒత్తిడికి గురైన అతను వ్యక్తిగతంగా కూడా విఫలమయ్యాడు. దాంతో సీఎస్కే యాజమాన్యం సీజన్ మధ్యలోనే జడేజాను తప్పించి ధోనీకి మళ్లీ సారథ్యం కట్టబెట్టింది. ఈ నిర్ణయంతో ఆగ్రహానికి గురైన జడేజా గాయం సాకుగా చూపించి జట్టుకు దూరమయ్యాడు. సీఎస్కే నిర్ణయం కారణంగా టీమిండియా కెప్టెన్సీ అందుకునే అవకాశం కోల్పోయిందని జడేజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సీఎస్కే సైతం ధోనీ బర్త్ డే సందర్భంగా విష్ చేస్తూ రూపొందించిన వీడియోలో జడేజా ఒక్కన్నే పక్కనపెట్టేసింది.
2012లో సీఎస్కేలోకి వచ్చిన జడేజా ఆరంభంలో విఫలమైనా ధోనీ అండగా నిలిచాడు. టెస్ట్లకు మాత్రమే పనికొస్తాడనుకున్న జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా తీర్చిదిద్దాడు. అయితే కెప్టెన్సీ విషయంలో సీఎస్కే మేనేజ్మెంట్తో జడేజాకు విభేదాలు రావడంతో అతను జట్టును వీడాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే జడేజాను ట్రేడింగ్ ద్వారా ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.