అశ్విన్ వాటే ఓవర్..
ఇక అశ్విన్ తన సూపర్ బౌలింగ్లో ఢిల్లీకి సూపర్ బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కింగ్స్ పంజాబ్ను కష్టాల్లో పడేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ అందుకున్న అశ్విన్.. తొలి బంతికి కరుణ్ నాయర్(1)ను పెవిలియన్కు పంపాడు. ఇక అదే ఓవర్ ఐదో బంతికి నికోలస్ పూరన్(0)ను బౌల్డ్ చేశాడు. ఆ ఓవర్లో అశ్విన్ రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అయితే ఈ ఓవర్ చివరిబంతి ఆడిన మ్యాక్స్వెల్ బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసి గాయపడ్డాడు. డైవ్ చేసిన క్రమంలో అశ్విన్ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిలలాడిన అతను టీమ్ ఫిజియో సాయంతో మైదానం వీడాడు. ఇక అతని స్థానంలో అజింక్యా రహానే ఫీల్డింగ్ చేశాడు.
అలా అయితే సీజన్ మొత్తం దూరం..
ప్రస్తుతానికి అశ్విన్ గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినప్పటికి భుజం డిస్లొకేట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే డిస్లొకేట్ అయితే రికవరీ కావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఢిల్లీ జట్టులో ప్రధాన స్పిన్నర్ అయిన అశ్విన్ దూరమైతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా స్పిన్ పిచ్లైన యూఏఈలో ఆ జట్టు రాణించాలంటే అశ్విన్ తుది జట్టులో ఉండాల్సిందే. పరీక్షల అనంతరమే అతని గాయం తీవ్రతపై స్పష్టతరానుంది. ఇక డ్రెస్సింగ్ రూమ్లో అశ్విన్ చేతికి కట్టు కట్టుకొని కనిపించాడు. ఇక గతంలో కింగ్స్ పంజాబ్ కెప్టెన్గా ఉన్న అశ్విన్ ఈ సీజన్కు ముందే ఢిల్లీకి బదిలి అయ్యాడు. పంజాబ్ తరఫున 28 మ్యాచ్లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 25 వికెట్లు తీశాడు. ఓవరాల్గా 140 మ్యాచ్ల్లో 127 వికెట్లు తీశాడు.
థ్రిల్లింగ్ విక్టరీ..
సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్లో కగిసో రబడా రఫ్ఫాడించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. రబడా వేసిన సూపర్ ఓవర్లో పంజాబ్ రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి రాహుల్ రెండు పరుగులు తీసి ఆ మరుసటి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. ఆ వెంటనే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ కావడంతో పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు బంతుల్లోనే ముగించింది. అయితే రిషభ్ పంత్ తొలి బంతి వదిలేసి టెన్షన్ పెట్టాడు. ఇక రెండో బంతి షమీ వైడ్ వేయగా.. మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా ఆడిన పంత్.. రెండు పరుగులు తీయడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.
అటు స్టోయినీస్..ఇటు మయాంక్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 120 పరుగులకే పరిమితమైతదా? అనిపించింది. కానీ చివర్లో స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 89) వీరోచిత ఇన్నింగ్స్తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది. ఓటమి దశ నుంచి గెలుపు ముంగిట నిలిపిన మయాంక్ ఆ లాంఛనాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు.