ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్స్లో ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'ఇది స్పెషల్ డే. ఒక ప్రత్యేకమైన ఆరంభం. ప్రతి ముగింపు.. ఇంకోదానికి కొత్త ప్రారంభం. ఐపీఎల్తో నా సమయం ఈ రోజుతో ముగుస్తుంది. కానీ.. వివిధ లీగ్ల చుట్టూ ఆటను అన్వేషించే సమయం ఈ రోజుతోనే మొదలవుతోంది. ఐపీఎల్లో నాకు మధుర జ్ఞాపకాలను అందించిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి కృతజ్ఞతలు. నా ముందున్న అవకాశాలను అస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను.'అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
2008లో చెన్నై సూపర్ కింగ్స్తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన అశ్విన్.. ఇప్పటి వరకు 221 మ్యాచ్లు ఆడి 187 వికెట్లు తీసాడు. సీఎస్కేతో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణె సూపర్జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాదే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తాజాగా ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. గతేడాదే సీఎస్కేకు రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్..ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. దాంతో సీఎస్కే జట్టు నుంచి అశ్విన్ను తప్పించాలని చర్చ జరుగుతుండగా.. అతను రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఐపీఎల్ ద్వారా అశ్విన్ దాదాపు రూ. 100 కోట్లు ఆర్జించాడు.

2008లో అశ్విన్ను రూ. 12 లక్షలకు సీఎస్కే కొనుగోలు చేయగా.. మూడు సీజన్లు పాటు అతను అదే ధరతో జట్టులో కొనసాగాడు. అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో అతని ధర అమాంతం పెరిగింది. 2011 వేలంలో అశ్విన్ను సీఎస్కే రూ. 3 కోట్ల 91 లక్షల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది. 2013 వరకు ఇదే ధరతో అతను కొనసాగగా.. 2014లో సీఎస్కే రూ. 7 కోట్ల 50 లక్షలకు తీసుకుంది. 2015 సీజన్లో కూడా సీఎస్కేకు ఆడిన అశ్విన్.. 2016 సీజన్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్కు మారాడు. అతన్ని రూ. 7 కోట్ల 50 లక్షలకు పుణే కొనుగోలు చేసింది. 2017 సీజన్ వరకు ఆ జట్టుకే ఆడిన అశ్విన్.. 2018లో పంజాబ్ కింగ్స్కు మారాడు.
రూ. 7 కోట్ల 60 లక్షలకు ఆ జట్టు కొనుగోలు చేసింది. 2019 వరకు పంజాబ్కు ఆడిన అశ్విన్.. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్కు అదే ధరకు వెళ్లాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అశ్విన్ను రూ. 5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనసాగించింది. 2024 వరకు ఆ జట్టుకే ఆడిన అశ్విన్.. గతేడాది తిరిగి సొంతగూటికి చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని ఏకంగా రూ. 9 కోట్ల 75 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ కెరీర్లో అశ్విన్ ఇదే రికార్డ్ ధర. కానీ అతను ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఓవరాల్గా 18 సీజన్లు ఆడిన అశ్విన్.. మొత్తం రూ. 97 కోట్ల 24 లక్షల రూపాయాలను ఆర్జించాడు. ఇందులో 70 శాతం ఆదాయం సీఎస్కే ద్వారానే అశ్విన్కు రావడం గమనార్హం.