
కాన్పూర్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసి మూడో భారత బౌలర్గా గుర్తింపు పొందాడు. స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ను వెనక్కినెట్టి మరీ ఈ ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ చివరి రోజు ఆటలో ఆ జట్టు ఓపెనర్ టామ్ లాథమ్ను ఔట్ చేసిన అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ తరఫున అనిల్ కుంబ్లే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందాడు. కుంబ్లే 619 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 434 వికెట్లతో దిగ్గజ పేసర్ కపిల్ దేవ్ రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ 418 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే హర్భజన్ 417ను అధిగమించాడు.
ఇక అనేక మలుపులు తిరిగిన ఈ తొలి టెస్ట్ చివరకు ఫలితం తేలకుండానే ముగిసింది. చివరి క్షణం వరకు పోరాడిన భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. ఆజాజ్ పటేల్(23 బంతుల్లో 2 నాటౌట్), రాచిన్ రవీంద్ర(91 బంతుల్లో 18 నాటౌట్) అడ్డుగోడలా నిలబడటంతో భారత విజయం చేజారింది. 4/1 ఓవర్నైట్ స్కోర్తో సెకండ్ ఇన్నింగ్స్ను కొనసాగించిన న్యూజిలాండ్ ఆఖరి రోజు ఆట ముగిసేసమయానికి 98 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిని తప్పించుకుంది.
బ్యాడ్ లైట్ కారణంగా మరో 8 నిమిషాల ముందే అంపైర్లు మ్యాచ్ను నిలిపి వేసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 3 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2021-23 ఎడిషనలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ డ్రా ముగియడంతో ఇరు జట్లకు చెరో 6 పాయింట్ల దక్కాయి. అయితే సొంతగడ్డపై సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ భారత్ను చేజార్చుకోవడం భవిష్యత్తులో ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు.