ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో చేసిన మార్పులపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 15 మంది జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకని ప్రశ్నించాడు. భారత సెలెక్టర్ల నిర్ణయం తనకు అర్థం కాలేదని చెప్పాడు. గాయంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమవ్వడంతో అతని స్థానంలో సెలెక్టర్లు హర్షిత్ రాణాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకొన్న టీమ్ మేనేజ్మెంట్.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసింది.
ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు..?
ఈ నిర్ణయాన్ని అశ్విన్ తప్పుబట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా భారత జట్టు మార్పులపై స్పందించిన అశ్విన్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. "ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేసిందో నాకైతే అర్థం కావడం లేదు. అదనపు స్పిన్నర్ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో ఉన్న యశస్వి జైస్వాల్ను తప్పించారు. ఈ టోర్నీ కోసం ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లను తీసుకుంటారని నేను భావించాను. కానీ, దుబాయ్ లాంటి మైదానాల్లో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు? ఈ విషయం నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు.

వరుణ్ చక్రవర్తీ చోటు ఎలా..?
బెస్ట్ స్పిన్ ఆల్రౌండర్లు అయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను తుది జట్టు నుంచి ఎలాగూ తప్పించలేరు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్లు కూడా ఆడటం ఖాయం. ఒకవేళ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలంటే ఒక స్పెషలిస్ట్ పేసర్ను తప్పించి హార్దిక్ను రెండో పేసర్గా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మూడో పేసర్ జట్టులో ఉండాలంటే.. మాత్రం ఒక స్పిన్నర్ను తుది జట్టు నుంచి తప్పించాలి. అప్పుడు కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తికి ఎలా అవకాశం కల్పిస్తారు.
బంతి టర్న్ అవ్వడం లేదు..
దుబాయ్లో అందరూ అనుకుంటున్నట్లు బంతి టర్న్ అవ్వడం లేదు. ఇటీవలే ముగిసిన ఐఎల్ టీ20లో అక్కడ బంతి స్పిన్ అవ్వలేదు. 180 పరుగుల లక్ష్యాన్ని కూడా జట్లు సునాయసంగా చేధించాయి. ఈ క్రమంలో ఈ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నాకు అసౌకర్యంగా కనిపిస్తోంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు(రివైజ్డ్):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లు:
యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివమ్ దూబె.