చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సక్సెస్ సీక్రెట్ ఏంటో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. తన కోర్ టీమ్కు వరుస అవకాశాలు ఇవ్వడమే ధోనీ కెప్టెన్సీ రహస్యమన్నాడు. ఇతర సారథులు ధోనీలా ఒకే జట్టును కొనసాగించలేకపోయారని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమిపై తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన అశ్విన్.. పరోక్షంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్పై విమర్శలు గుప్పించాడు.
ధోనీ 15 మంది ఆటగాళ్లను తీసుకుంటే వారినే కొనసాగించేవాడని తెలిపాడు. 'డబ్ల్యూటీసీ టైటిల్ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు. ఫైనల్లో విజేతగా నిలవడానికి ఆసీస్కు అర్హత ఉంది. మార్నస్ లబుషేన్కు లండన్లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉపయోగపడింది. అయితే, కేవలం ఒక్క టెస్టుతోనే విజేత తేలిపోవడం వల్ల ఎవరు ఎలా ఆడారనేది చెప్పడం కష్టమే.

కానీ, విజేతగా నిలవడానికి మాత్రం ఆస్ట్రేలియా పూర్తి అర్హత ఉంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవడంలో ఆస్ట్రేలియా విఫలమైంది. గత కొన్నేళ్లుగా టీమిండియా మాదిరిగా ఆస్ట్రేలియా కూడా నిలకడగా టెస్టు క్రికెట్ ఆడుతోంది. గత పదేళ్ల నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా నెగ్గలేదు. ఈ బాధ, ఆవేశం అభిమానుల్లో ఉండటం అర్థం చేసుకోదగినదే.
ఈ విషయంలో బాధపడుతున్న ఫ్యాన్స్కు నా సానుభూతి తెలియజేస్తున్నా. ప్రతి కీలక మ్యాచ్కు ముందు ప్రతీ అభిమాని ఓ క్రికెట్ ఎక్స్పర్ట్ అయిపోతాడు. ఫలానా ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోండి. మరో ఆటగాడిని పక్కనపెట్టండని సోషల్ మీడియా వేదికగా సూచిస్తుంటారు. ఎంతటి నాణ్యమైన ఆటగాడైనా సరే రాత్రికి రాత్రే పెను మార్పులు తీసుకురాలేడు.
ఐసీసీ టోర్నీలో టీమిండియా ఓడిన ప్రతీసారి చాలా మంది మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే కెప్టెన్గా ధోనీ ఏం చేశాడంటే.. క్లిష్టమైన విషయాలను కూడా చాలా సాధారణంగా మార్చేసేవాడు. అతడి నాయకత్వంలో నేనూ కూడా ఆడా. ఏదైనా సిరీస్కు లేదా టోర్నీకి 15 మంది జట్టును తీసుకుంటే తుది జట్టులోకి వచ్చే 11 మందితోనే మొత్తం ఆడించేవాడు.
విఫలమైనా అవకాశం ఇచ్చేవాడు. దాని వల్ల జట్టులో తమ స్థానం భద్రంగా ఉంటుందనే భరోసా ఆటగాళ్లకు వచ్చేది. మరింత రాణించేందుకు ఆస్కారం ఉండేది'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్కు చోటు దక్కకపోవడం విమర్శలకు దారి తీసింది.