
సెంచూరియన్: టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఆటగాళ్ల బ్యాటింగ్లోని లోపాలను శార్దూల్ ఠాకూర్ తన ఆటతో ఎత్తిచూపాడని కొనియాడాడు. అంతేకాకుండా శార్దూల్ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా లోయరార్డర్ బలంగా మారిందన్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆటకు ముందు శార్దూల్-అశ్విన్ చిట్ చాట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో శార్దూల్ సూపర్ బ్యాటింగ్తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్ విఫలమైన వేళ లోయరార్డర్లో హాఫ్ సెంచరీలు బాది సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పెర్ఫామెన్స్నే గుర్తు చేసిన అశ్విన్.. శార్దూల్ ప్రదర్శనను కొనియాడాడు. 'మన బ్యాటర్లు విదేశాల్లో ఎక్కువగా షార్ట్ లెంగ్త్ బంతులను ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యేవారు. అయితే ఆసీస్ గడ్డ మీద ఠాకూర్ హుక్-పుల్ షాట్లతో పరుగులు రాబట్టాడు. మా అందరిలోని లోపాలను తన బ్యాటింగ్తో ఎత్తి చూపాడు. అలానే ఇంగ్లండ్లోనూ రాణించాడు. ఇదే ఫామ్ను సౌతాఫ్రికా పర్యటనలోనూ కొనసాగించాలని ఆశిస్తున్నా'' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఇక సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో అశ్విన్, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్లో విఫలమయ్యారు. వర్షం కారణంగా రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. మూడో రోజు ఆటలో పిచ్ పూర్తిగా బౌలింగ్కు అనుకూలంగా మారింది. దాంతో 272/3 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబడా(3/72), లుంగి ఎంగిడి(6/71) చెలరేగడంతో 55 పరుగుల వ్యవధిలోనే భారత్ మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్(260 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 123), అజింక్యా రహానే (102 బంతుల్లో 9 ఫోర్లతో 48) వెనువెంటనే ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(4), రిషభ్ పంత్(8)తో పాటు శార్దూల్ ఠాకూర్(4), మహమ్మద్ షమీ(4), జస్ప్రీత్ బుమ్రా(14) వరుసగా ఔటయ్యారు. సిరాజ్(4 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును బవుమా, డికాక్ గట్టెక్కించారు. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 72 పరుగులు జోడించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని శార్దూల్ విడదీసాడు. డికాక్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో బవుమా(31 బ్యాటింగ్)తో పాటు ముల్డర్(4 బ్యాటింగ్) ఉన్నాడు.