టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సినిమాలు అంటే పిచ్చి. ఈ విషయాన్ని ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉన్న అశ్విన్.. సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. తమ కుటుంబం తెలుగు సినిమాలు కూడా చూస్తోందని వెల్లడించాడు. తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాను డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాడు. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా తనకు చాలా ఇష్టమని తెలిపాడు.
కరోనా మొదటి లాక్డౌన్(2020) సమయంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారితో అశ్విన్ సరదాగా చిట్ చాట్ చేశాడు. తెలుగులో మాట్లాడుకున్న ఈ ఇద్దరూ ఆటగాళ్లు సినిమాల గురించి చర్చించారు. తన ఆల్టైమ్ ఫేవరేట్ తెలుగు మూవీ మగధీర అని చెప్పిన అశ్విన్.. ఫేవరేట్ హీరో మాత్రం మహేష్ బాబు అని తెలిపాడు. హనుమ విహారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మగధీర ఫేవర్ మూవీ అనగానే.. మీరు రామ్చరణ్ అభిమానా? అని హనుమ విహారి అడగ్గా.. కాదని చెప్పిన అశ్విన్.. మహేష్ బాబు తన ఫేవరేట్ తెలుగు హీరో అని స్పష్టం చేశాడు.

మహేష్ బాబు లాస్ట్ సినిమా అయిన 'గుంటూరు కారం'పై కూడా అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది మార్చిలో తన యూట్యూబ్ షో 'ది సదరన్ ఫ్లేవర్'లో అశ్విన్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమా చాలా సరదాగా, వినోదాత్మకంగా ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా 'కుర్చీ మడత పెట్టి' పాటకు మహేష్ బాబు, శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేశారని అశ్విన్ కితాబిచ్చారు. మహేష్ బాబు అద్భుతమైన డ్యాన్స్ అని కొనియాడారు.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్.. ఇటీవలే ఐపీఎల్కు కూడా గుడ్బై చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.
మరోవైపు మహేష్ బాబు అప్కమింగ్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని 120 దేశాల్లో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.