టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎదురైన అవమానాలు తట్టుకోలేకే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని ఆరోపించారు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
బుధవారమే స్వదేశం బయల్దేరిన అశ్విన్.. ఇవాళ భారత్కు చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అశ్విన్కు ఘన స్వాగతం లభించింది. బ్యాండ్ బాజా మధ్య అశ్విన్ను ఇంట్లోకి ఆహ్వానించిన కుటుంబ సభ్యులు అతన్ని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అశ్విన్ తండ్రి రవిచంద్రన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.

ఈ సందర్భంగా అశ్విన్ తండ్రి మీడియాతో మాట్లాడారు. 'నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే అతను రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నా. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన షాక్కు గురి చేసింది. అశ్విన్ ప్రకటించే వరకు రిటైర్మెంట్ గురించి నాకు కూడా తెలియదు.
ఏది ఏమైనా అతని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నా. అశ్విన్ వీడ్కోలు పలికినందుకు సగం సంతోషం.. సగం బాధగా ఉంది. ఎందుకంటే అతను ఇంకొన్నాళ్లు ఆడాల్సింది. రిటైర్మెంట్ అనేది అతని వ్యక్తిగత నిర్ణయం. అందులో నేను జోక్యం చేసుకోలేను. అశ్విన్ రిటైర్మెంట్ మా కుటుంబానికి భావోద్వేగపూరితమైన క్షణం.
ఎందుకంటే అతను గత 14-15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటిది ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం మా అందర్ని షాక్కు గురి చేసింది.'అని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు.
తన తండ్రి ఆరోపణలను అశ్విన్ ఖండించాడు. తన తండ్రి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
'మా నాన్నకు మీడియాతో ఎలా మాట్లాడాలనే శిక్షణ లేదు. నాన్నా.. ఏంటిది? ఇలా డాడ్ స్టేట్మెంట్ ట్రెండ్ను నువ్వు కూడా అనుసరిస్తావని నేను అస్సలు ఊహించలేదు. అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. ఆయన్ను క్షమించి, ఒంటరిగా వదిలేయండి.'అని అశ్విన్ ట్వీట్ చేశాడు.