దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వెల్లడించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ బౌలర్లు దుమ్ములేపారు. జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నుమాన్ అలీలు కెరీర్ బెస్ట్ ర్యాంకులు అందుకున్నారు. హాసన్ ఆరు, షాహీన్ తొమ్మిది, నౌమాన్ ఆరు స్థానాలను ఎగబాకి వరుసగా 14, 22, 46వ ర్యాంకులకు చేరుకున్నారు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్లో ఈ ముగ్గురు ఐదేసి వికెట్లు తీయడం విశేషం.
తొలి ఇన్నింగ్స్లో హసన్ అలీ(5-27) ఐదు వికెట్లతో మెరిస్తే.. రెండో ఇన్నింగ్స్లో ఆఫ్రిది(5-52), నుమాన్ అలీ(5- 86)తో మెరిశారు. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఇక టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్టెన్లో నిలిచాడు. అశ్విన్ (850 పాయింట్లతో) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. బుమ్రా 11వ స్థానంలో నిలిచాడు. ఇక తొలి స్థానంలో కమిన్స్(908 పాయింట్లు), నీల్ వాగ్నర్( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్ విభాగంలో పాక్కు చెందిన అబిద్ అలీ 40, అజ్హర్ అలీ 16 , నౌమన్116వ ర్యాంకుల్లో నిలిచారు. జింబాబ్వే బ్యాట్స్మెన్లో రెగిస్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 81వ ర్యాంకుకు, లూక్ జాంగ్వే 133వ స్థానంలో నిలిచాడు. బౌలర్లు ముజారాబనీ 51, టెండాయ్ కిసొరో 110వ స్థానంలో నిలిచారు. ఇక కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో నిలిచారు.