టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్టైమ్ ఎలెవన్ను ప్రకటించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్ టీమ్ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో చైన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇద్దరిని తీసుకున్న అశ్విన్.. ముంబై ఇండియన్స్ నుంచి నలుగురిని ఎంపిక చేశాడు.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక్కరే ఎంపికవ్వగా.. ఆర్సీబీ నుంచి ఇద్దరు చోటు దక్కించుకున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వరల్డ్ బెస్ట్ క్రికెటర్స్ భాగమయ్యారు. అయితే అశ్విన్ తన జట్టులో స్టార్ ఆటగాళ్లను విస్మరించడం చర్చనీయాంశమైంది.

నో గేల్.. నో వార్నర్..
1983 వరల్డ్ కప్ విన్నర్ క్రిష్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్.. తన ఆల్టైమ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్లను అశ్విన్ పట్టించుకోలేదు. ఈ టోర్నీ చరిత్రలోనే సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ఉన్న శిఖర్ ధావన్ను విస్మరించాడు.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ఐదు సార్లు టైటిల్ అందించిన సారథి రోహిత్ శర్మను ఓపెనర్గా ఎంపిక చేసిన అశ్విన్.. అతనికి జతగా టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. మూడో స్థానంలో తన మాజీ సహచరుడు సురేశ్ రైనాకు అవకాశం ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిళ్లు గెలవడంలో సురేశ్ రైనా కీలక పాత్ర పోషించాడు.
కెప్టెన్గా ధోనీ..
ఇందులో రెండు టైటిళ్లు అశ్విన్ ఉండగా సీఎస్కే(2010, 2011) కైవసం చేసుకుంది. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను అశ్విన్ నాలుగో స్థానంలో ఎంపిక చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ యూనిట్కు వెన్నుముక అయిన సూర్య... ఆ జట్టు 2019, 2020లో టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ను ఐదో స్థానంలో తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీని ఐపీఎల్ ఆల్టైమ్ ఎలెవన్కు కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఎంపిక చేసాడు.
ఆల్రౌండర్లకు నో ఛాన్స్..
స్టార్ ఆల్రౌండర్స్ అయిన హార్దిక్ పాండ్యా, షేన్ వాట్సన్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావోలను అశ్విన్ విస్మరించాడు. వారికి బదులు స్పిన్ ఆల్రౌండర్లు సునీల్ నరైన్, రషీద్ ఖాన్లను తీసుకున్నాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం టీ20 దిగ్గజ స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ పేస్ ద్వయం జస్ ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగాలను అశ్విన్ తన ఆల్టైమ్ ఎలెవన్ పేసర్లుగా పేర్కొన్నాడు.
11వ స్థానాన్ని సన్రైజర్స్ హైదరాబాద్కు భువనేశ్వర్ కుమార్కు ఇచ్చాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్గా భువనేశ్వర్ కుమార్ కొనసాగుతున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ ఆల్టైమ్ ఐపీఎల్ ఎలెవన్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్/కీపర్), సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా.