ఎన్ 95 మాస్క్ల పంపిణీకి నేను రెడీ: రవీచంద్రన్ అశ్విన్

చెన్నై: కరోనా వైరస్పై అవగాహన కల్పించే విషయంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా మహమ్మారికి సంబంధించి ట్విటర్ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు. బట్టతో తయారు చేసిన మాస్క్లు కాకుండా ఎన్95 మాస్క్లను వాడాలని కోరాడు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. తన ట్విటర్ యూజర్ నేమ్ను కూడా మాస్క్ అప్ ఇండియా(బట్ట మాస్క్లు) వాడవద్దని మార్చాడు.
'కరోనా నుంచి సురక్షితంగా ఉండటానికి వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ వెయించుకోండి. బట్ట మాస్క్లు కాకుండా డబుల్ మాస్క్లు వాడండి. ఈ ప్రాణాంతక వైరస్ను తరమికొట్టడానికి వ్యాక్సినే ఏకైక మార్గం'అని ట్వీట్ చేశాడు.
ఎన్ 95 మాస్క్లు ఫ్రీగా ఇస్తా..
ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజన్.. ఎన్95 మాస్క్లు ఖరీదైనవి. వాటిని మేము వాడలేమని కామెంట్ చేశాడు. 'ఒక ఎన్95 మాస్క్ ధర రూ.70. మాములు సర్జికల్ మాస్క్ రూ.10. వీటిని 8 గంటలకు పైగా వాడలేం. పొట్టకూటి కోసం తిప్పలు పడే పేద ప్రజలు ఇంత ధరలు పెట్టి ఎలా కొనగలరు?'అని ప్రశ్నించాడు. దీనికి అశ్విన్ బదులిస్తూ 'ఎన్95 మాస్క్ను శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు. వాటిని కొనలేని వారికి నేను ఇవ్వగలను. అవి ప్రజలకు ఎలా చేరాలన్నది నాకు సూచించండి చాలు'అని పేర్కొన్నాడు.
చాలా పెద్ద దేశం.. ఓపిక ఉండాలి..
మరో నెటిజన్ తనకు రెండో డోస్ టీకా గడువు సమీపిస్తున్నా.. ఎక్కడా వ్యాక్సిన్ లేదని, ఇదే రియల్ ఇండియా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి ప్రతిస్పందించిన అశ్విన్.. మనది అతి ఎక్కువ జనాభా గల దేశం. దయచేసి మీ వంతు వచ్చే వరకు జాగ్రత్తగా వేచి ఉండండని సూచించాడు. కరోనా వైరస్ బాధితులను కాపాడే క్రమంలో వైద్యుల ముఖాల్లో కనిపిస్తున్న నిస్సహాయత తనను చంపేస్తోందని ఇటీవల అశ్విన్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయని బాధపడ్డాడు.

అర్ధాంతరంగా తప్పుకున్న అశ్విన్..
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న అశ్విన్.. లీగ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడటంతో మధ్యలోనే టోర్నీని వీడాడు. చెన్నైకి వచ్చి తన కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకున్నాడు.'ఐపీఎల్ 2021కి విరామం ఇస్తున్నా. నా కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ కఠినమైన సమయాల్లో నేను వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నా. అన్ని సవ్యంగా ఉంటే.. ఐపీఎల్ 2021కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఢిల్లీ ప్రాంచైజీకి ధన్యవాదాలు' అని అప్పట్లో అశ్విన్ ట్వీట్ చేశాడు.

5 మ్యాచ్లు.. ఒక వికెట్
ఈ సీజన్లో అశ్విన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 5 మ్యాచ్లను ఆడిన ఈ తమిళాడు ప్లేయర్.. కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతేకాకుండా ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్కు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అటు బ్యాటింగ్, ఇటు బ్యాటింగ్తో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
మేటి ఆల్రౌండర్లా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అశ్విన్ జోరును చూసి అతనిలో ఇంకా వైట్ బాల్ క్రికెట్ ఆడే సత్తా ఉందని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ ఐపీఎల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఇక కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications