
లండన్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటి క్రికెట్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్నే తరఫున అతనికి కౌంటీ చాంపియన్షిప్ ఆడే అవకాశం లభించిందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తెలిపింది. అన్నీ సవ్యంగా కుదిరితే అతను సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో ప్రతిష్టాత్మక సిరీసుకు ముందు అతనికి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరకనుంది.
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా విరామంలో ఉన్నారు. వారితో పాటే అశ్విన్ సైతం కుటుంబంతో కలిసి బ్రిటన్లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్ షైర్, వొర్సెస్టర్షైర్కు ఆడిన అనుభవం అశ్విన్కు ఉంది. ఒకవేళ ఓవల్ వేదికగా సోమర్ సెట్తో జరిగే మ్యాచ్లో సర్రే తరఫున అతను బరిలోకి దిగితే.. విలువైన మ్యాచ్ ప్రాక్టీస్ లభించినట్టే. పైగా ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లండ్తో నాలుగో టెస్టు ఆడనుంది.
జులై 11న ఆరంభమయ్యే కౌంటీ మ్యాచ్పై అశ్విన్తో పాటు సర్రే సైతం ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సమయానికి అనుగుణంగా అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని వారు ఆశాభావంతో ఉన్నారు. ఐసీసీ వరల్ట్ టెస్టు చాంపియన్షిప్ ఓటమి తర్వాత సారథి విరాట్ కోహ్లీ సన్నాహక మ్యాచ్ల గురించి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అశ్విన్కు సరైన సమయంలో సరైన అవకాశం లభించినట్లైంది. ఇక తొలి టెస్ట్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ల ఏర్పాటు చేయాలని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డును బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది. ఈ ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభానికి ముందే గాయంతో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తప్పుకున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో గాయపడ్డ ఇషాంత్ శర్మ మాత్రం టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకుంటాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. న్యూజిలాండ్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బంతిని ఆపే క్రమంలో ఇషాంత్ బౌలింగ్ చేసే చేతికి గాయమైంది. మూడు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఈ ఐదు టెస్ట్ల సిరీస్ జరగనుంది.