
కేప్టౌన్: టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడని కొనియాడాడు. అయితే, అతని వారసత్వాన్ని కొనసాగించడం మామూలు విషయం కాదన్నాడు.
'క్రికెట్లో కెప్టెన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. వారు నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘన విజయాల గురించే మాట్లాడుతుంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంకల్లో కోహ్లీ గొప్ప విజయాలు సాధించాడు. భారత క్రికెట్లో కెప్టెన్గా అతను నెలకొల్పిన బెంచ్మార్క్లను కొనసాగించడం ఏ నాయకుడికైనా కష్టమే. విజయాలు అనేవి పంటకు ముందు మనం నాటిన విత్తనాల ఫలితమే. టీమిండియా విజయాల కోసం కోహ్లీ నాణ్యమైన విత్తనాలను నాటాడు.
అతని స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడిని వెతికిపెట్టే తలనొప్పిని సెలెక్టర్లు ముందుంచాడు. కోహ్లీ అందించిన ఈ ఘన వారసత్వం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను' అని రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో 55 టెస్టులు ఆడిన అశ్విన్ 293 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ సత్తా చాటి మూడు సెంచరీలు నమోదు చేశాడు.
ఇక పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ సైతం కోహ్లీని ప్రశంసించాడు. 'భవిష్యత్తు తరాలకు నిజమైన నాయకుడు విరాట్ కోహ్లీ. యువ ఆటగాళ్లకు నువ్వు ఆదర్శం. మైదానంలో నీ దూకుడు కొనసాగాలి' అని ఆమీర్ ట్వీట్ చేశాడు.
టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం విరాట్ కెప్టెన్సీని కొనియాడాడు. 'కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు విదేశాల్లో గెలవడమనేది గొప్ప ఘనతగా ఉండేది. ఇప్పుడు భారత్ విదేశాల్లో ఓడిపోవడం బాధాకరంగా మారింది. కోహ్లీ భారత క్రికెట్ను అంత ఉన్నత స్థితికి తీసుకెళ్లాడు. అది అతడి వారసత్వం'అని ట్వీట్ చేశాడు.