ముంబై: భారత్తో జరిగిన రెండో టెస్ట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి వరల్డ్ రికార్డు నమోదు చేసిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రత్యర్థి జట్టు ఆటగాడయినా.. భారత్ ప్లేయర్లు సైతం ఆజాజ్ పటేల్ ప్రతిభను కొనియాడుతున్నారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డు సృష్టించిన అజాజ్ పటేల్కు అశ్విన్ ప్రత్యేక కానుక అందించాడు. మ్యాచ్ ముగిశాక భారత జట్టు ఆటగాళ్ల సంతకాలతో కూడిన తన జెర్సీని అతనికిచ్చాడు.
'డ్రెస్సింగ్ గది నుంచి అజాజ్ పటేల్ బౌలింగ్ను ఎంతో ఆస్వాదించా. నా సహచరులు సంతకాలు చేసిన జెర్సీని నేనే అందుకుంటానేమో అనుకున్నా'అని అశ్విన్ తెలిపాడు. 'జెర్సీ అందుకున్న ఆనందాన్ని చెప్పలేను. అసలు మాటలు రావడం లేదు'అని అజాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్ పాటిల్ కూడా ఆజాజ్ను సత్కరించాడు. త్వరలో ప్రారంభం కాబోయే ఎంసీఏ మ్యూజియానికి అజాజ్.. బంతిని, తన టీషర్ట్ను అందించాడు.
న్యూ జిలాండ్తో టీ20 సిరీస్ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టెస్టు సిరీస్నూ కూడా చేజిక్కించుకుంది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో నెగ్గింది. తొలి టెస్టులో విజయానికి వికెట్ దూరంలో ఆగిపోయిన భారత్.. రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 372 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్ను చేజిక్కించుకుంది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోరు 140/5తో నాలుగో రోజు, సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టు కేవలం 27 పరుగుల తేడాలో మిగతా అయిదు వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లను జయంత్ యాదవ్ (4/34) సొంతం చేసుకోవడం విశేషం.
మరో వికెట్ను అశ్విన్ (4/49) సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 325 పరుగులు చేయగా.. కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ను టీమ్ఇండియా 276/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ సాధించిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసి, 70 పరుగులు చేసిన అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.