ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. జట్టులో స్టార్ క్రికెటర్లకు కొదవ లేకున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ముంబై ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్తో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని, చెప్పడానికి కూడా ఏమి లేదన్నాడు.
అలా హార్దిక్ పాండ్యా ఎందుకు అన్నాడో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించాడు. బౌలర్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశాడని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పేర్కొన్నాడు.
'పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా చెప్పడానికి ఏం లేదన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే అతని దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు. గత మ్యాచ్లో కొన్ని ఓవర్లలో 20 పరుగుల కంటే ఎక్కువ సమర్పించుకున్నామని హార్దిక్ తెలిపాడు. అయితే ప్రస్తుత ఫార్మాట్కు ఈ మాటలు ఏ మాత్రమ అమోదయోగ్యం కాదు. ఈ రోజుల్లో 190 పరుగులు చాలా తక్కువ. పంజాబ్పై 190+ లక్ష్యం నమోదు చేసిన ముంబై.. 20 పరుగులు తక్కువగా చేసింది.

ఇది స్లో పిచ్ అని, 240 పరుగులు చేయడం కష్టమని హెడ్ కోచ్ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. అయితే ఈ పిచ్పై 240 చేయకున్నా.. 220-230 పరుగులు చేయవచ్చు. అయితే 230 చేసినా ముంబై గెలిచే స్థాయిలో లేదు. 190+ లక్ష్యం ఉన్నప్పుడే దీపక్ చాహర్ తన తొలి ఓవర్లో 21 పరుగులు ఇచ్చుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా అంతే. తర్వాత స్పెల్లో బుమ్రా-ఘజన్ఫర్ కాస్త కట్టడి చేయగలిగారు. మళ్లీ ఎప్పుడైతే దీపక్ చాహర్ వచ్చాడో.. మ్యాచ్ నుంచి ముంబై దూరమైంది.
జస్ప్రీత్ బుమ్రా వైఫల్యం కూడా ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. ట్రెంట్ బౌల్ట్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శార్దూల్ ఠాకూర్ వికెట్ తీసినా.. అతను చాలా రిస్క్ బౌలర్. ఘజన్ఫర్ ఒక్కడు పర్వాలేదనిపించాడు. మిచెల్ సాంట్నర్ కూడా ఇబ్బంది పడ్డాడు. ముంబై ఈ సమస్యల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. బౌలింగ్ గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బంతితో రాణించడం మినహా మరే సమాధానం లేదు.'అని అశ్విన్ విశ్లేషించాడు.