ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో టీమిండియా ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. రాత్రి వేళ మ్యాచ్ల్లో స్పిన్ బౌలింగ్పై ఎక్కువ ఆధారపడటం అంత మంచిది కాదని హెచ్చరించాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఆడించకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు.
యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్తో 27 బంతుల్లోనే లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా కాంబినేషన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, ఏకైక స్పెషలిస్ట్ బౌలర్తో టీమిండియా ఆడింది. టీ20ల్లో టాప్ బౌలర్గా కొనసాగుతున్న అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కలేదు. దాంతో ఈ కాంబినేషన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అర్ష్దీప్ను ఆడించకపోవడం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియా కాంబినేషన్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా ఎక్స్ట్రా బ్యాటర్తోనే బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పిచ్లు డ్రైగా ఉన్నప్పుడు కూడా టీమిండియా పేసర్ కంటే స్పిన్నర్ల వైపే మొగ్గు చూపింది. అయితే యూఏఈతో తొలి మ్యాచ్లో కూడా ఎక్స్ట్రా బ్యాటర్ ఎందుకు? శివమ్ దూబేను ఐదో బౌలర్గా ఉపయోగించాలా? నేనే అర్ష్దీప్ సింగ్ స్థానంలో ఉంటే మాత్రం కచ్చితంగా ఫీలయ్యేవాడిని.
అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతను నెంబర్ వన్ టీ20 బౌలర్ కూడా. అంతేకాకుండా టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్లోనూ అతను అద్భుతంగా రాణించాడు. అతన్ని ఆడించాల్సింది. టీమిండియా స్పిన్పై ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకరమవుతుందనేది నా అభిప్రాయం. అందుకే జట్టులో అదనపు సీమర్ను ఆడించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఆడబోయే మ్యాచ్ల్లో ప్రస్తుత కాంబినేషన్ అన్నిసార్లూ సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కచ్చితంగా అదనపు ఫాస్ట్ బౌలర్ అవసరం'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.