చెన్నై: భారత్లో కరోనా వైరస్(19) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన కార్యక్రమానికి నాంది పలికాడు. వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు తనవంతుగా కృషిచేస్తున్నాడు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'ను విజయంవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అశ్విన్ తాజాగా తన ట్విటర్ ఖాతా పేరు మార్చుకున్నాడు. 'జనతా కర్ఫ్యూ' తర్వాత దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించినా సోమవారం అనేక మంది రహదార్లపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు సీరియస్గా చెబుతున్నా ప్రజలు మాత్రం కేర్లెస్గా వ్యవహరిస్తున్నారు.
We need to remember we are a densely populated country and a very large part of them don’t have access to information.
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 23, 2020
దీంతో వైరస్వ్యాప్తి పెరిగే అవకాశముంది. అలా కాకుండా ప్రజలు చైతన్యవంతంగా మారాలని అశ్విన్.. తన ట్విటర్ యూజర్ నేమ్ను 'లెట్స్ స్టే ఇండోర్స్ ఇండియా' అని మార్చుకున్నాడు. దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని దాని ఉద్దేశం. రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని అంతకుముందు ట్వీట్ చేశాడు. అలాగే మనదేశంలో జనాభా ఎక్కువ ఉన్నందున చాలా మందికి సమాచార ప్రసార మాధ్యమాలు లేవని గుర్తుచేశాడు.