సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో ఓటమిపాలైన టీమిండియాకు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. ఇది యువ జట్టు అని, తప్పకుండా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది టర్నింగ్ పిచ్ అనే వ్యాఖ్యలను అతను తప్పుబట్టాడు. ఈ టెస్ట్కు తయారు చేసింది టర్నింగ్ పిచ్ కాదని, ప్రమాదకర వికెట్ అని అభిప్రాయపడ్డాడు.
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఈడెన్ గార్డెన్స్ పిచ్ టర్నింగ్ ట్రాక్ అంటే నేను ఒప్పుకోను. ఇది టర్నింగ్ ట్రాక్ కాదు డేంజరస్ పిచ్. సరిగ్గా తయారు చేయకపోవడంతో పిచ్ ఇలా ప్రమాదకరంగా మారింది. ఎవరైనా ఈ పిచ్ను టర్నింగ్ ట్రాక్ అంటే నేను ఏ మాత్రం అంగీకరించను. ఇది ప్రణాళిక ప్రకారం తయారు చేయని పిచ్. ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. వాస్తవానికి ఈడెన్ గార్డెన్స్లో టర్నింగ్ ట్రాక్ను సిద్దం చేయలేరు. టర్నింగ్ ట్రాక్ కోసం ప్రయత్నిస్తే ఇలానే పేలవమైన ప్రమాదకర పిచ్ తయారవుతుంది. ఈ పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ టర్న్ అవుతుంది.
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తప్పా మరే బ్యాటర్ హాఫ్ సెంచరీ సాధించలేదు. ఇది పేలవమైన పిచ్ అనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు ఇది చాలా యువ జట్టు. వారు తమను తాము స్థిరపరుచుకోవడానికి సమయం పడుతుంది. గతంలో కూడా ఇలాంటి పరాజయాలు ఎదురయ్యాయి. 2012లో నేను, విరాట్ కోహ్లీ, పుజారా జట్టులోకి కొత్తగా వచ్చినప్పుడు ఇంగ్లండ్తో సొంతగడ్డపై సిరీస్ను కోల్పోయాం. ఆ తర్వాతే మేం ఎలా ఆడాలో.. ప్రత్యర్థి ఎలా ఎదుర్కోవాలో మా ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్చుకున్నాం. కాబట్టి విమర్శలను కొంతకాలం పక్కన పెడదాం. ఈ జట్టు ఖచ్చితంగా మెరుగుపడుతుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ను భారత్ కోల్పోయింది. ఆ తర్వాత గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి.