చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీమిండియా ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రజలను కోరాడు. కరోనాకు కచ్చితంగా అందరూ భయపడాలన్నాడు. 'కరోనాకు సంబంధించి భయపెట్టే విషయాలను వ్యాప్తి చేయొద్దని అంటున్న వారికి చెబుతున్నా. దయచేసి భయపడండి, బాగా భయపడండి. మహమ్మారిపై పోరాడేందుకు అదొక్కటే మార్గం. యుద్ధప్రాతిపదకన రక్షణ చర్యలు అవసరం'' అని ఆదివారం అశ్విన్ ట్వీట్ చేశాడు.
ప్రజలు భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించిన ఓ ఫొటోను సైతం అతను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. 'ఇది నేటి ఫొటో. భౌతిక దూరం పాటించకుండా జనం రేషన్ షాప్ ముందు వరుసలో నిలబడ్డారు. భయమొక్కటే ఈ పరిస్థితిని మారుస్తుందంటే... అందరూ భయపడాల్సిందే'అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటో ట్వీట్ను అశ్విన్ తర్వాత తొలగించాడు.
తన కుటుంబంలో ఆరుగురు పెద్దవాళ్లు, నలుగురు పిల్లలు కరోనా బారిన పడడంతో అశ్విన్ అర్ధంతరంగా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చెబుతూ.. ప్రజలు వీలైనంతగా సురక్షితంగా ఉండడానికి ప్రయత్నించాలని కోరాడు. ''మీ భయాన్ని అర్థం చేసుకోగలను. మా కుటుంబమంతా కరోనా బారిన పడింది.
మీకు, నాకూ ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. కానీ కొంతమందికి ఇప్పటికీ కరోనా ప్రమాద తీవ్రత తెలియట్లేదు'' అని అశ్విన్ పేర్కొన్నాడు. కోవిడ్కు సంబంధించిన సమచారాన్ని ఎప్పటికప్పుడూ అశ్విన్ ట్విటర్ వేదికగా ప్రజలకు చేరవేస్తున్నాడు. కోవిడ్పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో తాను పాలుపంచుకుంటానని కూడా ప్రకటించాడు.