టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో కెప్టెన్గా ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్.. బ్యాటర్గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్ల్లో 0, 12, 14, 0, 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ సూర్య ఒకే తరహా షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ ఐదు ఇన్నింగ్స్ల్లోనూ ఫ్లిక్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
అతనితో పాటు సంజూ శాంసన్ కూడా ఫుల్ షాట్ ఆడబోయి ఐదు ఇన్నింగ్స్ల్లో వికెట్ పారేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లకు వరుసగా మూడు సార్లు , మార్క్ వుడ్, బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఒకసారి వెనుదిరిగాడు. ఈ ఇద్దరి బ్యాటింగ్ వైఫల్యం కంటే ఔటైన తీరే ఇప్పుడు అందర్నీ విస్మయపరుస్తోంది.

ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు భారమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్నా.. సూర్య, సంజూ శాంసన్ బ్యాటింగ్ ప్రదర్శన తీవ్ర చర్చనీయాంశమైంది. వీలైనంత త్వరగా ఈ ఇద్దరూ తమ బలహీనతలను అధిగమించకపోతే కెరీరే ప్రశ్నార్థకంగా మారుతోందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అభిమానులు.. సూర్య బ్యాటింగ్లోని దమ్ము తగ్గుతోందని, అతని బొమ్మ తిరగబడుతోందని కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు. సూర్య, సంజూ ఒకే తరహా బంతి, షాట్తో ఔటవ్వడం సరికాదన్నాడు. వీలైనంత త్వరగా బలహీనతలను అధిగమించాలని అభిప్రాయపడ్డాడు.

'సమస్యంతా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్పైనే. ఈ సిరీస్లో అతని కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతని సారథ్యానికి ఏలాంటి లోటు లేదు. కానీ బ్యాటింగ్లోనే మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఒకే తరహా బంతి, ఫీల్డ్ సెటప్, షాట్కు ఔటయ్యారు. ఐదు ఇన్నింగ్స్ల్లో ఒకే తరహా తప్పిదం చేశారు.
ఒకటి, రెండు మ్యాచ్ల్లో ఇలా జరిగిందంటే నేను అర్థం చేసుకుంటా. కానీ ఇలా ఔటవ్వడం సాధారణమైన విషయం కాదు. ఆటగాళ్లు స్వేచ్చగానే ఆడాలి. కానీ బౌలర్లు వేసే ప్రశ్నలకు కచ్చితంగా సమాధానాలు ఇవ్వాలి.'అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.