ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశాంతంగా ఉండాలని మాజీ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం తగ్గించుకోవాలని సలహా ఇచ్చాడు.
ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గౌతమ్ గంభీర్ ఇజ్జత్కు సవాల్గా మారింది. అతను హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా చరిత్రలో ఎరుగని ఘోర పరాజయాలు చవిచూసింది. సుదీర్ఘ కాలం తర్వాత శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సొంతగడ్డపై క్లీన్ స్వీప్కు గురైంది.

గంభీర్ సామర్థ్యానికి పరీక్ష..
మూడు టెస్ట్ల సిరీస్లో న్యూజిలాండ్ 3-0తో టీమిండియాను వైట్ వాష్ చేసింది. ఈ ఘోర పరాజయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఒత్తిడిని పెంచింది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ఘోర ఓటమిపై గంభీర్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మపై కన్నెర్ర చేయడంతో పాటు వివరణ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోచ్గా గంభీర్ సామర్థ్యానికి పరీక్షగా మారింది.
స్పాట్ డిసిషన్స్ వద్దు..
పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రవి శాస్త్రి.. గౌతమ్ గంభీర్కు కొన్ని సలహాలు ఇచ్చాడు.
ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలి, వారి స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలి? అనే విషయాలను వివరించాడు. అంతేకాకుండా ఇతరుల మాటలు విని అప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకోవడం మానేయాలన్నాడు.
ప్రశాంతంగా ఉండాలి..
'కోచ్ అనేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలనేది నా ఆలోచన. ఇతరుల మాటలు ఏదో విధంగా ప్రభావితం చేస్తాయి. ఏ మాత్రం ఆలోచించకుండా అప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా ఆటగాళ్లను అర్థం చేసుకోవాలి.
ఓ ప్లేయర్ ను ఏ విధంగా దగ్గర తీసుకుని ప్రోత్సాహిస్తే, ఏం చేస్తే మెరుగ్గా రాణిస్తాడనేది కోచ్గా గ్రహించాలి. ఓ ఆటగాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, విదేశీ పిచ్లపై, భారత్తో సహా ఇతర భిన్న పరిస్థితుల్లోనూ ఎలా
ఆడుతున్నాడు? సవాళ్లను ఎలా అధిగమిస్తున్నాడు అనేది నిశితంగా పరిశీలించి ఓ అంచనాకు రావాలి.'అని శాస్త్రి పేర్కొన్నాడు.
రాత్రికి రాత్రే జరగదు
ఆటగాళ్లతో సత్సంబంధాలు కొనసాగించడం అనేది రాత్రికి రాత్రే జరగదని రవి శాస్త్రి అన్నాడు. గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల మనస్థత్వం, వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతీ ఒక్క ఆటగాడి ఆలోచనలను గౌరవించడంతో పాటు వాళ్లు విజయం సాధించే దిశగా ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసం నింపాలని సూచించాడు.
'ప్రతి ఒక్క ఆటగాడిని అర్థం చేసుకోవడానికి నాకు కూడా కొంత సమయం పట్టింది. గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను ఎక్కువగా ఐపీఎల్ సమయంలో చూసి ఉంటాడు. లేదంటే మరి కొంత మంది ఆటగాళ్లను తాను ఆడే సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో చూసి ఉంటాడు. కానీ చాలా మంది ఆటగాళ్లు భిన్న స్వభావం, విభిన్నమైన పరిస్థితులు, ప్రాంతాలు, సంస్కృతి నేపథ్యంతో వచ్చి ఉంటారు.
కాబట్టి ఆటగాళ్ల స్వభావాన్ని లోతుగా విశ్లేషించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఓ ప్లేయర్ ఇంట్రవర్ట్ అయి ఉండొచ్చు. కానీ మనం అతడిని ప్రోత్సాహించి అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. అప్పుడు అతను మ్యాచ్ విన్నర్ గా నిలుస్తాడు." అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్న సమయంలోనే టీమిండియా ఆసీస్ గడ్డపై రెండు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(2018-19),( 2020-21) గెలిచింది.