
న్యూఢిల్లీ: తన జీవితంలో రెండు సెమీ ఫైనల్ ఓటములు కన్నీళ్లు తెప్పించాయని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. అందులో ఒకటి తాను ప్లేయర్గా ఉండగా.. మరొకటి హెడ్ కోచ్గా ఉన్నప్పుడని చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఎదురైన ఓటమి ఒకటైతే.. మరొకటి 1987 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయం మరొకటని చెప్పాడు. ఈ రెండు మ్యాచ్ల్లో భారత జట్టు సునాయసంగా గెలవాల్సిందని, కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారాయన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి ఈ విషయాన్ని వెల్లడించాడు.
'టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్తో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి తీవ్రంగా నిరాశ పరిచింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత జట్టు సునాయసంగా గెలవాల్సింది. వర్షం కారణంగా రిజర్వ్ డే ఆడాల్సి వచ్చి పరిస్థితులన్నీ మారాయి. 'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్తో రెండు రోజుల పాటు జరిగిన నాటి మ్యాచ్లో తొలి రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కివీస్ 239 పరుగులకే కట్టడి చేసింది. దాంతో భారత్ విజయం ఖాయమని అంతా భావించారు.
కానీ వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్డేకు వాయిదా పడటంతో.. వికెట్ స్వింగ్కు అనుకూలించి బ్యాటింగ్కు ప్రతికూలంగా మారింది. ధోనీ చివరి వరకు ప్రయత్నించా ఫలితం లేకపోయింది. 'ఆటగాడిగా 1987 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రపంచకప్ గెలిచిన 1983 జట్టు కన్నా 1987 టీమ్ చాలా బలమైనది. కానీ సెమీఫైనల్లోనే ఓటమిపాలయ్యాం.'అని రవి శాస్త్రి పేర్కొన్నాడు.