టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్పై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పించాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా బౌలర్లు వికెట్ కోసం కష్టపడుతున్నారు. ఆరంభంలోనే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీసిన భారత బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేసారు.
దాంతో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. బజ్బాల్ గేమ్తో దూకుడుగా ఆడుతున్న ఈ జోడీ ఇప్పటికే 240 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నమోదు చేసింది. మూడు క్యాచ్లు వదిలేయడం కూడా ఈ జోడీకి కలిసొచ్చింది. అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ సరిగ్గా లేదని, అతని ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టలేదని ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి అన్నాడు. భారీ స్కోర్ ఉన్నప్పుడు.. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ పెట్టాలని, కానీ గిల్.. డిఫెన్సివ్ ఫీల్డ్ సెటప్తో టీమిండియాకు నష్టం చేస్తున్నాడని విమర్శించాడు.

'శుభ్మన్ గిల్ కెప్టెన్సీని నమ్మలేకపోతున్నా. భారీ స్కోర్ ఉన్నప్పుడు కూడా స్లిప్లో ఒకరు.. గల్లీలో ఒక ఫీల్డర్ను పెట్టడం ఏంటి?'అని రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. నెటిజన్లు సైతం శుభ్మన్ గిల్ అనుభవరాహిత్యం టీమిండియా కొంపముంచుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకోని ఘోర తప్పిదం చేసిందని, అతనికి బదులు అర్ష్దీప్ సింగ్ను ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రసిధ్ కృష్ణ చెత్త బౌలింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్లు సెట్ అయ్యారని కామెంట్ చేస్తున్నారు. ప్రసిధ్ ఒకే ఓవర్లో 23 పరుగులు సమర్పించుకున్నాడు. మరికొందరు స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకోవాల్సిందని, ఇప్పటికైనా బౌలింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.
రెండో రోజు ఆటలోనూ గిల్ కెప్టెన్సీని పుజారా తప్పుబట్టాడు. 'భారత్ డిఫెన్సివ్ ఫీల్డ్ను పెట్టింది. బోర్డుపై భారీ పరుగులు ఉన్నప్పుడు కొత్త బంతితో అటాకింగ్ ఫీల్డ్ సెటప్ పెట్టాలి. డిఫెండ్ చేసుకోవడానికి ఇది సమయం కాదు. ఇంగ్లండ్ బ్యాటర్లు బౌండరీలు బాదినా.. శుభ్మన్ గిల్ పట్టించుకోవద్దు. ఓవర్ అటాకింగ్ ఉండాలని చెప్పడం లేదు. స్క్వేర్ లెగ్లో ఓ ఫీల్డర్ను పెట్టాలి. జాక్ క్రాలీ క్యాచింగ్ పొజిషన్ అది.'అని పుజారా అన్నాడు.