టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాలపై మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ, గంభీర్ వ్యూహాలు సరిగ్గా లేవని విమర్శించాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు.
దాంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు. మహమ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి.. బ్రేక్ సమయంలో భారత బౌలింగ్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఎక్స్ట్రా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో బౌలింగ్ చేయించకపోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ.. గంభీర్ వ్యూహాలు చెత్తగా ఉన్నాయని ఘాటుగా విమర్శించాడు. నమ్మకం లేనప్పుడు వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు.
'భారత బౌలింగ్ చెత్తగా ఉంది. టీమిండియా మేనేజ్మెంట్ వద్ద సరైన వ్యూహాలు లేవు. స్పిన్నర్లను వాడుకోవాల్సిన రీతిలో ఉపయోగించలేదు. జడేజా బంతి అందుకునే ముందు 40 ఓవర్ల గ్యాప్ ఉంది. వాషింగ్టన్ సుందర్ తొలి ఓవర్ వేసేందుకు కూడా చాలా సమయం పట్టింది. మరి ఎందుకు ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు. వారిపై నమ్మకం లేనప్పుడు వారిని తుది జట్టులోకి తీసుకోవడం ఎందుకు?'అని రవి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా 23 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ 15 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఓ వికెట్ మాత్రమే తీసాడు.