
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్గా కేఎల్ రాహుల్కు బదులు శుభ్మన్ గిల్ను ఆడించాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ శర్మకు జతగా అతనే సరైనోడని తెలిపాడు. ఈ సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. కానీ ఇప్పటి వరకూ కేఎల్ రాహుల్ , శుభమన్ గిల్లో ఎవరు ఓపెనర్గా ఆడతారు? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పష్టత ఇవ్వలేదు.
శుభమన్ గిల్ గత కొన్ని రోజుల నుంచి సూపర్ ఫామ్లో ఉన్నాడు. సెంచరీ, డబుల్ సెంచరీతో ఓపెనింగ్ స్థానం కోసం మూడు ఫార్మాట్లలోనూ గట్టి పోటీనిస్తున్నాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం అంత టచ్లో లేనట్లు కనిపిస్తోంది. గత ఏడాది గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కనీసం ఒక్క సిరీస్లో కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో కేఎల్ రాహుల్తో పోలిస్తే? శుభమన్ గిల్కే మాజీ క్రికెటర్లు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
భారత్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా నెటిజన్ల అభిప్రాయానికే మద్దతు తెలిపాడు. కేఎల్ రాహుల్ ప్రస్తుతం భారత టెస్టు జట్టుకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. వైస్ కెప్టెన్గా ఉన్నంత మాత్రాన తుది జట్టులో ఆటోమేటిక్ ఛాయిస్గా ఎంపిక చేయాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఫుట్ వర్క్, షాట్ సెలెక్షన్ విషయంలో ప్రస్తుతం రాహుల్ కంటే గిల్ మెరుగ్గా ఉన్నాడని కితాబిచ్చిన రవిశాస్త్రి.. తుది జట్టు ఎంపిక నిర్ణయం మాత్రం పూర్తిగా జట్టు మేనేజ్మెంట్దే అని తేల్చేశాడు.
ఇక ఈ సిరీస్ను 4-0తో గెలవడంపై టీమిండియా ఫోకస్ పెట్టాలని రవి శాస్త్రి సూచించాడు. స్పిన్ కండిషన్స్ వాడుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడ్డాడు. నాగ్పూర్ పిచ్ గురించి ఆస్ట్రేలియా చేస్తున్న రగడను తప్పుబట్టాడు. తాను కోచ్ అయితే ఆసీస్ను 4-0తో ఓడించడంపైనే ఫోకస్ పెడతానని తెలిపాడు. 'నేనే కోచ్ను అయితే ఆస్ట్రేలియాను 4-0తో ఎలా ఓడించాలని ఆలోచిస్తా. ఫస్ట్ సెషన్లోనే లెగ్ స్టంప్కు వేసిన బంతి ఆఫ్ స్టంప్ ఎగరగొట్టాలే స్పిన్ అవ్వాలనుకుంటా.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.