అదే టర్నింగ్ పాయింట్
మ్యాచ్ అనంతరం హెడ్కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ... 'తొలి ఇన్నింగ్స్లో అజింక్య రహానే బ్యాటింగ్కు వెళ్లినప్పుడు టీమిండియా 60 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. విపత్కర పరిస్థితుల్లో 6 గంటల పాటు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అది ఆస్ట్రేలియా గడ్డపై అంటే మాటలు కాదు. అయినా రహానే బాగా ఆడి సెంచరీ చేశాడు. రహానే ఏకాగ్రత నమ్మశక్యం కానిది. ఈ మ్యాచ్లో అతడి బ్యాటింగే టర్నింగ్ పాయింట్. అతడు సెంచరీ చేయకుంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది' అని అన్నాడు. రహానే 223 బంతులతో 12 ఫోర్ల సాయంతో 112 రన్స్ చేశాడు.
జింక్స్ ప్రశాంతంగా ఉంటాడు
విరాట్ కోహ్లీ, అజింక్య రహానే కెప్టెన్సీలపై హెడ్కోచ్ రవిశాస్త్రి స్పదించాడు. కోహ్లీ, రహానే ఇద్దరూ ఆటను బాగా అర్థం చేసుకుంటారని, విరాట్ ఆటపట్ల దూకుడుగా ఉంటే.. జింక్స్ మాత్రం ప్రశాంతంగా ఉంటాడన్నాడు. అది వారి స్వభావమని చెప్పాడు. అయితే రహానే నిర్మలంగా ఉన్నా తనకేం కావాలో తెలుసని కోచ్ శాస్త్రి పేర్కొన్నాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. విరాట్ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే విరాట్ ఇండియాకి వచ్చేశాడు.
క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం
కెప్టెన్ విరాట్ కోహ్లీ లేడు.. స్టార్ పేసర్ మహ్మద్ షమీ లేడు.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ లేడు.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ లేడు.. సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో దూరమయ్యాడు. శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్ ఇద్దరూ అరంగేట్ర ఆటగాళ్లే. అయినా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై భారత్ ఓడించింది. అడిలైడ్ పరాజయం తర్వాత ఎవరూ ఊహించని రీతిలో విజయాన్నందుకుంది. నిజంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం.