
నాగ్పూర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టును నడిపించడానికి అతనే సరైన వ్యక్తి అని కొనియాడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా జరగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా శుభారంభం అందుకుంది. తొలి రోజు ఆటలో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటి పై చేయి సాధించింది. దాంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. ఐసీసీ వెబ్సైట్తో మాట్లాడుతూ.. కెప్టెన్గా రోహిత్ శర్మ అదరగొట్టాడని తెలిపాడు.
'టీమిండియాను నడిపించడానికి రోహిత్ శర్మనే సరైన వ్యక్తి. అతనో అద్భుతమైన కెప్టెన్. మ్యాచ్కు ముందు అతను ఎంతో హోమ్ వర్క్ చేస్తాడు. ఈ విషయంలో అతనికి సాటి లేరు. అతని ఆలోచనా విధానం అద్భుతం. ఈ రోజు అతని బౌలింగ్ మార్పులు స్పాట్ ఆన్గా ఉన్నాయి. వ్యూహాలను రచించడంలో అతను చాలా స్మార్ట్. అతను ప్రశాంతంగా, ఒదిగి ఉండే వ్యక్తి.
రోహిత్ శర్మ ఓ మంచి కెప్టెన్. చాలా స్మార్ట్గా జట్టును నడిపిస్తాడు. గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడు. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తాడు. కెప్టెన్ ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ఓపెనర్గా కూడా రోహిత్ శర్మకు తిరుగు లేదు. ఈ సిరీస్ సందర్భంగా అశ్విన్, కోహ్లీ, పుజారా గురించి ఎక్కువగా చర్చిస్తారు. కానీ వీరందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువ చర్చనీయాంశమవుతాడనిపిస్తోంది. అతను ఆ టోన్ సెట్ చేశాడు. అతని ఫామ్ సిరీస్ ఫలితాన్ని శాసించనుంది. రోహిత్ శర్మ ఒకసారి సెటిల్ అయితే పరుగుల వరద పారుతుంది. సెహ్వాగ్ తరహాలోనే రోహిత్ కూడా ఏ బౌలర్ను సెట్ కానివ్వడు.
సెహ్వాగ్ ఫామ్లో ఉంటే తన బ్యాటింగ్తో మిడిలార్డర్ పని సులువు చేశాడు. రోహిత్ శర్మ పాత్ర కూడా ఇప్పుడు అదే. ఈ సిరీస్ రోహిత్ సారథ్యానికి పరీక్ష అని అనుకోవడం లేదు. అతనో గొప్ప సారథి. ఇప్పటికే అతను ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
నాగ్పూర్ టెస్ట్లో రవీంద్ర జడేజా(5/47), రవిచంద్రన్ అశ్విన్(3/42) సత్తా చాటడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), పీటర్ హ్యాండ్స్కోంబ్(84 బంతుల్లో 4 ఫోర్లతో 31), అలెక్స్ క్యారీ(33 బంతుల్లో 7 ఫోర్లతో 36) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు.