
నాగ్పుర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో చర్చంతా స్పిన్ చుట్టే నడుస్తోంది. భారత్లోని పరిస్థితులు స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు జట్లు ప్రత్యేక దృష్టి సారించాయి. మాజీ క్రికెటర్లు సైతం స్పిన్ బౌలింగే కీలకం అవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక సలహా ఇచ్చాడు. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆసీస్కు వ్యతిరేకంగా అశ్విన్కు అతి ప్రణాళికలకు వెళ్లాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ గడ్డపై వరుసగా రెండు పర్యటనల్లో సిరీస్ విజయాలు సాధించిన టీమిండియాకు రవిశాస్త్రి హెడ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్కమింగ్ సిరీస్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' రవిచంద్రన్ అశ్విన్.. అతిగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం లేదు. అతను ముఖ్యమైన ఆటగాడు కాబట్టి తన వ్యూహాలకు కట్టుబడి ఉంటే చాలు. సిరీస్ భవితవ్యాన్ని అతడి ఫామ్ నిర్ణయించే అవకాశం ఉంది. అతను అద్భుతమైన ఆల్రౌండర్. జట్టుకు కీలకమైన పరుగులూ అందించగలడు.
అశ్విన్ విజృంభిస్తే అది సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. దాదాపు అన్ని వేదికల్లో అతను ప్రపంచ స్థాయి బౌలరే. కానీ భారత పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరం. బంతి స్పిన్ తిరగడం ప్రారంభమై. పిచ్ నుంచి సహకారం లభిస్తే బ్యాటర్లందరినీ ఇబ్బంది పెడతాడు. కాబట్టి అశ్విన్ అతిగా ఆలోచించి.. అనవసర ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే బౌలింగ్ చేయాలి. మిగతా పనిని పిచ్ను చేయనివ్వాలి.
మూడో స్పిన్నర్ విషయానికొస్తే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలి. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లు ఒకే తరహా బౌలర్లు. కుల్దీప్ భిన్నం. తొలి రోజు బంతిని తిప్పగలిగేది కుల్దీప్ మాత్రమే'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రవి శాస్త్రి హెడ్ కోచ్ ఉన్నన్ని రోజులు కుల్దీప్ యాదవ్ భారత్ తరఫున అవకాశాలు అందుకోలేకపోయాడు. పూర్తిగా బెంచ్కే పరిమితమై జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అదే రవి శాస్త్రి కుల్దీప్ యాదవ్ను ఆడించాలని చెప్పడం విచిత్రంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.