
న్యూఢిల్లీ: సన్రైజర్స్ హైదరాబాద్ సంచలనం, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ను ఇప్పుడే టీమిండియాకు ఎంపిక చేయవద్దని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్తో పాటు ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్కు కూడా అతన్ని పక్కనపెట్టాలని సూచించాడు. ఐపీఎల్ లో అతడు రాణించినా.. టీ20 ఫార్మాట్ లో అతడిని ఇప్పుడే ఆడించడం తొందరపాటు చర్య అవుతుందని.. దానికి బదులు ఇతర ఫార్మాట్లలో ఆడించాలని అభిప్రాయపడ్డాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'ఉమ్రాన్ మాలిక్ను ఇప్పుడే టీ20లు ఆడించొద్దు. టీ20 ప్రపంచకప్కు కూడా అతన్ని ఎంపికచేయ వద్దు. అతన్ని ఎదగనివ్వండి. విదేశీ పర్యటనల్లో జట్టుతో పాటు తీసుకెళ్లండి. ఒకవేళ ఉమ్రాన్ను తప్పనిసరిగా ఆడించాల్సి వస్తే 50 ఓవర్ల ఫార్మాట్ లేక రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు)లో ఆడించండి. టెస్టుల్లో అతన్ని ఎదగనివ్వండి. ఉమ్రాన్ గ్రోత్ను చూడండి.. కానీ ఇప్పుడే టీ20లు ఆడించొద్దు.'అని అన్నాడు.

ఐపీఎల్లో 14 మ్యాచులాడి 22 వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టర్.. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగం కంటే బౌలింగ్ చేయడంలో దిట్ట. ఐపీఎల్లో రాణించిన ఉమ్రాన్ను జాతీయ జట్టుకు ఎంపిక చేసినా ఇటీవలే ఢిల్లీలో ముగిసిన తొలి టీ20లో మాత్రం అతనికి ఆడే అవకాశం దక్కలేదు. ఉమ్రాన్ నేర్చుకునే దశలో ఉన్నాడని, ఇంకొంచెం టైమ్ పడుతుందని చెప్పారు. కాగా ఉమ్రాన్ను జాతీయ జట్టులోకి తీసుకోవడంపై రెండ్రోజుల క్రితం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.