ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న డే/నైట్ టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో తొలి టెస్ట్ ఆడిన టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించగా.. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. బ్యాటింగ్కు ప్రతికూల పరిస్థితులు ఉన్న తొలి ఇన్నింగ్స్లో ఓపికగా బ్యాటింగ్ చేసి 70పైకి బంతులాడి 26 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

అయితే పింక్ బాల్ టెస్ట్కు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనర్గా ఎవర్నీ ఆడిస్తారనేది చర్చనీయాంశమైంది. రోహిత్ ఓపెనింగ్ చేస్తాడా? లేక తొలి టెస్ట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాహుల్ను కొనసాగిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ వ్యవహారంపై స్పందించిన రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. పింక్ బాల్ టెస్ట్లో ఓపెనర్గా కేఎల్ రాహుల్నే కొనసాగించాలని సూచించాడు. ఆసీస్ పరిస్థితులకు అలవాటు పడేందుకు రోహిత్ శర్మకు ఎక్కువ సమయం దొరకలేదని చెప్పాడు.
'కేఎల్ రాహుల్నే ఓపెనర్గా కొనసాగించాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడేందుకు రోహిత్ శర్మకు ఎక్కువ సమయం దొరకలేదు. అతను వచ్చి రాగానే ప్రైమినిస్టర్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు. నేనైతే సేమ్ సెటప్తో పింక్ మ్యాచ్ ఆడాలని చెబుతాను. రోహిత్ శర్మ ఐదు, లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు.
శుభ్మన్ గిల్ కూడా ఫిట్గా ఉంటే టీమిండియా మరింత బలంగా ఉంటుంది. గత 10-15 ఏళ్లలో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన భారత జట్ల కంటే ప్రస్తుత జట్టు చాలా బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. ఎందుకంటే ప్రస్తుత జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. శుభ్మన్ ఫిట్గా ఉంటే అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. రోహిత్ శర్మ కూడా ఫిట్గా ఉంటే అతను కూడా బరిలోకి దిగుతాడు. ఈ ఇద్దరూ దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ స్థానాలను భర్తీ చేయనున్నారు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం 9.30 గంటలకు పింక్ బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు నాలుగు పింక్ బాల్ మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచి.. ఒకదాంట్లో ఓటమిపాలైంది.