లండన్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కావాలా? ఐసీసీ ట్రోఫీనా? అనే విషయం తేల్చుకోవాలన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తడబడటం చూసి శాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి అంచున చేరడంపై ఆయన తీవ్రంగా స్పందించాడు. 'బీసీసీఐకి ఏది ముఖ్యమో తేల్చుకోవాలి. బోర్డు ప్రాధాన్యం ఐపీఎల్కా? లేక టీమిండియాకా? అనేదానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు. ఐపీఎల్కే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐసీసీ టైటిల్స్ గెలవడంపై ఆశలు వదులుకోవాలి.

ఐసీసీ ట్రోఫీలే కావాలనుకుంటే మాత్రం ఐపీఎల్లో సమూల మార్పులు చేయాలి. టీమిండియాకు ఆడే ఆటగాళ్లను ఐపీఎల్కు దూరంగా ఉంచాలి. బీసీసీఐ చెబితే ఫ్రాంచైజీలు వినవా? ఎందుకంటే రెండు నెలలు తీరిక లేకుండా క్రికెట్ ఆడి.. వారం రోజుల్లోనే ఐసీసీ టోర్నీలోని ఫైనల్ మ్యాచ్ ఆడటం అంత సులువైన పనికాదు.
బీసీసీఐ ప్రపంచ క్రికెట్నే శాసిస్తోంది. ఐసీసీ ట్రోఫీలు ఆడే ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వలేదా? ఈ విషయంపై బీసీసీఐ వీలైనంత త్వరగా ఫ్రాంచైజీలతో మాట్లాడాలి. ఎందుకంటే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. భారత్.. ఐసీసీ టోర్నీల్లో విఫలమైన ప్రతీ సారి ఐపీఎల్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లోనూ టీమిండియా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. ఐపీఎల్ ముగిసిన అనంతరం చాలా తక్కువ సమయంలోనే నాటి ఫైనల్ జరగ్గా.. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడలేక టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఆస్ట్రేలియాతో ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న తాజా మ్యాచ్లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్లో 469 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48) విలువైన పరుగులు చేశాడు.
ఇక రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది. దాంతో భారత్ ముందు 444 పరుగుల భారీ లక్ష్యం నమోదు అయ్యింది. లక్ష్యచేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే అద్భుతమే జరగాలి.