టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తీరు తనను బాధించిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. టెస్ట్ క్రికెట్లో ఎన్నో అద్భత విజయాలు అందించడంతో పాటు మరెన్నో మైలు రాళ్లు అందుకున్న విరాట్ కోహ్లీకి ఘనమైన వీడ్కోలు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ తప్పు చేసిందని పరోక్షంగా వెల్లడించాడు. బీసీసీఐ, ఆటగాళ్ల మధ్య మరింత సమన్వయం అవసరమని సూచించాడు.
36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ.. వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. టెస్ట్ క్రికెట్లో మరో 2-3 ఏళ్లు ఆడుతాడని అంతా భావించారు. కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం వ్యవధిలోనే కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. భారత క్రికెట్కు ఎంతో సేవ చేసిన విరాట్ కోహ్లీ.. వీడ్కోలు మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
|
తాజాగా కోహ్లీ రిటైర్మెంట్పై స్పందించిన రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానే బీసీసీఐ స్థానంలో ఉండి ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసేవాడినని తెలిపాడు. 'ఏ ఆటగాడైనా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే అతను ఎంత విలువైన ఆటగాడో తెలిసొస్తుంది. విరాట్ కోహ్లీ ఇలా రిటైర్ అవ్వడం చూసి బాధపడ్డాను. అతనికి గౌరవమైన వీడ్కోలు దక్కాల్సింది. ఆటగాళ్లు, బోర్డుకు మధ్య మరింత సమన్వయం ఉండాలి. ఈ విషయంలో నేను ఏదైనా చేయగలిగే స్థాయిలో ఉంటే మాత్రం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీని టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ప్రకటించేవాడిని.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

123 టెస్ట్ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కనీసం 10వేల పరుగులు చేసే వరకైనా కోహ్లీ ఆటలో కొనసాగాల్సిందనేది చాలా మంది అభిమానులు అభిప్రాయం. మానసికంగా ఒత్తిడికి గురవ్వడంతోనే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి తెలిపాడు. శారీరకంగా ఫిట్గా ఉన్నా.. మానసికంగా కోహ్లీ అలసిపోయాడని చెప్పాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభ్మన్ గిల్కు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అతని సారథ్యంలోనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్కు తెరలేవనుంది.